పనుల్లో జాప్యం.. వైద్య కళాశాలపై నిర్లక్ష్యం
వైద్య విద్యార్థులకు సౌకర్యాలేవీ?
పనుల్లో వేగం పెంచాలి
ఏలూరు టౌన్: జిల్లాకే తలమానికంగా ఏలూరులో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటుచేశారు. అప్పట్లో 40 శాతానికి పైగా పనులు పూర్తికాగా.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏలూరు జీజీహెచ్ ప్రాంగణంలో శాశ్వత మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలిస్తే నత్తేనయం అన్నట్టుగా ఉంది. దీంతో పనులు ఎప్పటికి పూర్తవుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఈ విద్యా సంవత్సరానికై నా పూర్తిస్థాయిలో మెడికల్ కళాశాల భవనాన్ని అందుబాటులోకి తెస్తారా, పనుల్లో ఆలస్యానికి కారణాలు ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సుమారు రూ.80 కోట్లకు పైగా నిధులతో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే భవనాన్ని వేగంగా పూర్తి చేయాలనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో..
నాడు.. గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కౌన్సిల్ అనుమతులు రావటంతో యుద్ధప్రాతిపదికన ఏ లూరు పాత బస్టాండ్ ప్రాంతంలోని జిల్లా వైద్య ఆ రోగ్య శాఖ ప్రాంగణంలో రూ.60 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో, ల్యాబ్లతో మెడికల్ కాలేజీ భవనాన్ని నిర్మించారు. కేవలం 18 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో జీ–ప్లస్ 2 భవనాన్ని నిర్మించారు. అత్యాధునిక ల్యాబ్లు, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా డిజిటల్ క్లాస్రూమ్స్, లెక్చర్ రూమ్స్, అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఇలా అన్నీ సమకూర్చారు. 2023 సెప్టెంబర్లో ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు సైతం ప్రారంభించి తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు.
18 నెలలుగా తీవ్ర ఇబ్బందులు
నేడు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 18 నెలల కాలంలో శాశ్వత మెడికల్ కళాశాల భవనాన్ని నిర్మించటంలో జాప్యంతో వైద్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2024 జూన్లో అధికారం చేపట్టిన నాటి నుంచి కొన్ని నెలలపాటు నిర్మాణ పనులు నిలిచిపోగా, అనంతరం ప్రభుత్వం పనులు ప్రారంభించింది. అయినా నేటికీ పనుల్లో పెద్దగా పురోగతి కనిపించని పరిస్థితి. ఇప్పటికే వైద్య విద్యార్థులకు తరగతులను షెడ్డుల్లో ఏర్పాటు చేయాల్సిన దుస్థితి. ఇదే తరహాలో పనులు సాగుతూ ఉంటే నాలుగో మెడిసిన్ బ్యాచ్ వస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవని పలువురు అంటున్నారు.
మెడి ‘కిల్’ బాబు
నత్తనడకన ఏలూరు మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు
18 నెలలుగా తీవ్ర జాప్యం
ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
ఈ ఏడాదైనా పూర్తయ్యేనా?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 2023 సెప్టెంబర్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించారు. ఇప్పటికే మూడో ఏడాది వైద్య విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. అధికారులు సరైన రీతిలో తరగతి గదులను ఏర్పాటు చేయలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసి అత్యాధునిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
– కె.మధుకుమార్, న్యాయవాది, ఏలూరు
ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏళ్ల నాటి కల. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో అనుమతులు తెచ్చి, ఏలూరులో ప్రత్యేకంగా భవనాలు నిర్మించి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించారు. చంద్రబాబు ప్రభుత్వ అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా శాశ్వత భవన నిర్మాణాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం వేగంగా పనులు పూర్తిచేసి వైద్య విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.
–ప్రత్తిపాటి తంబి, న్యాయవాది, ఏలూరు
పనుల్లో జాప్యం.. వైద్య కళాశాలపై నిర్లక్ష్యం
పనుల్లో జాప్యం.. వైద్య కళాశాలపై నిర్లక్ష్యం


