
గ్రీన్ఫీల్డ్ పనులను అడ్డుకున్న రైతులు
జంగారెడ్డిగూడెం: గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో పొలాలకు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని పుట్లగట్లగూడెం గ్రీన్ఫీల్డ్ హైవే వద్ద రైతులు రాస్తారోకో చేసి పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైవే సర్వీస్ రోడ్డు పక్క నుంచి పొలాలకు వెళ్లే దారి ఇస్తామని చెప్పి, ఇవ్వకుండా సర్వీసు రోడ్డు నిర్మాణం చేపట్టారన్నారు. అలాగే హైవే పక్కనే ఉన్న కొంగల చెరువు సర్ప్లస్ వాటర్ దిగువ ప్రాంతాలకు వెళ్లే మురుగు కాలువను పూడ్చడంతో వరద నీరు పొలాలను ముంచెత్తుతోందన్నారు. వ్యవసాయ పనులకు సీజన్ ప్రారంభమైందని, పొలాలకు వెళ్లే మార్గం లేకుంటే నష్టపోతామన్నారు. రైతులు వామిశెట్టి హరిబాబు, గొల్లపూడి శ్రీనివాసరావు, సీలం వెంకటరాజు, బొచ్చు శ్రీను పాల్గొన్నారు.
పాఠశాలల్లో ప్రవేశాలపై ప్రత్యేక శ్రద్ధ
ఏలూరు(మెట్రో): అంగన్వాడీ కేంద్రాల్లోని ఐదేళ్లు నిండిన పిల్లలందరినీ ప్ర భుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం జీరో ఎన్రోల్మెంట్ కలిగిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జీరో నమోదు ఉన్న పాఠశాలల హెచ్ఎంలు అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేసేందుకు కృషి చేయాలన్నారు. హేబిటేషన్లో పిల్లలు లేరని పేర్కొన్న మండల విద్యాశాఖ అధికారులు, సీడీపీఓలు ఈ మేరకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఐసీడీఎస్ పీడీ పి.శారద, డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ, డీవైఈఓలు, ఎంఈఓలు సీడీపీఓలు పాల్గొన్నారు.
డీఎస్సీ పరీక్షలకు 503 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో శుక్రవారం జరిగిన డీఎస్సీ పరీక్షలకు 503 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 100 మందికి 74 మంది, మధ్యాహ్నం 100 మందికి 81 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 204 మందికి 173 మంది, మధ్యాహ్నం 205 మందికి 175 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
మీటర్ రీడర్ల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (టూటౌన్): విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే డిమాండ్ చేశారు. శుక్రవారం ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సమావేశాన్ని ఏలూరులో యూనియన్ జిల్లా కోశాధికారి మల్లేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా నాయకులు పి.కిషోర్ మాట్లాడుతూ ఎస్క్రో అకౌంట్ను తక్షణమే ఓపెన్ చేయాలని, మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూ పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు పి.జాకబ్ మాట్లాడుతూ మీటర్ రీడర్లు కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. సహాయ కార్యదర్శులు ఎ.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
కోకో రైతులకు ప్రోత్సాహం
ఏలూరు(మెట్రో): ప్రభుత్వం అందిస్తున్న ప్రో త్సాహం ద్వారా కోకో గింజలు అమ్మే రైతులు ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎస్.రామ్మోహన్ ప్రకటనలో తెలిపారు. కిలోకు కిలో కంపెనీలు రూ.450, ప్రభుత్వ ప్రోత్సాహం రూ.50 మొత్తంగా రూ.500 చెల్లిస్తారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1,536 టన్నుల కోకో గింజలను కొనుగోలు చేశారన్నారు. రైతులు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని వినియోగించుకోవాలన్నారు.

గ్రీన్ఫీల్డ్ పనులను అడ్డుకున్న రైతులు