
తాగునీటి వెతలు
భీమడోలు: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తింది. మంచినీటి చెరువుల నీటి మట్టాలు అడుగంటాయి. పంచాయతీలు తాగునీటిని సరఫరా చేయలేక గత 10 రోజులుగా బోరు నీరు కలిపిన నీటిని కొన్ని గ్రామాల్లో సరఫరా చేస్తున్నారు. మరిన్ని గ్రామాల్లో బోరు నీటిపైనే ఆధారపడుతున్నారు. గోదావరి కాల్వ మూసి 40 రోజులైంది. చెరువుల్లో అరకొరగా నింపడంతో పాటు వేసవి నీటి వినియోగం పెరగడంతో నీరు అడుగంటింది. దీంతో గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గోదావరి కాల్వకు అనుకుని ఉన్న పూళ్ల, పాతూరు, కురెళ్లగూడెం, సూరప్పగూడెం, గుండుగొలను, కొల్లేరు గ్రామాల్లో మంచినీటి చెరువుల్లో నీటి మట్టాలు అడుగంటాయి. ఫిల్టర్ చేసి ఆ నీటిని సరఫరా చేయడంతో దుర్వాసన వస్తోంది. నెల రోజులు దాటితే తాగునీటి తీర్చే సామర్థ్యం తీర్చే చెరువులు లేవు. సమ్మర్ యాక్షన్ ప్లాన్పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో తాగునీరు ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉన్నారని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. గోదావరి కాల్వ పూడికతీత, కర్రనాచు తొలగింపు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో వారం రోజులు తర్వాత కాల్వకు నీటిని వదిలే అవకాశాలున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. ప్రైవేటు వాటర్ను కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గుండుగొలనులోని వింధ్యవాసిని, బ్రాహ్మణ చెర్వులోని నీటి మట్టాలు పడిపోయాయి. బోరు నీరు, ఉప్పునీరు ఇవ్వడంతో ఈ నీటిని నిలుపుదల చేసి ట్యాంకర్ల ద్వారా నీటికి పంపిణీ చేయాలని భీమడోలు ఏఎంసీ మాజీ చైర్మన్ వగ్వాల భాస్కర్ సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ, ఎస్సీ ఏరియా, ఇతర ప్రాంతాలకు గత పది రోజులుగా బోరు నీరే ఇస్తున్నారని, విషయాన్ని ఇంచార్జి గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా గోదావరి కాల్వకు నీటిని విడుదల అయ్యే వరకు ఈ సమస్య పరిష్కారం కాదంటున్నారని ఫిర్యాదు చేసారు. ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేయాలని ఎంపీడీవో, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ సమస్యపై గుండుగొలను ఇరిగేషన్ సెక్షన్ ఏఈ సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా.. రెండు, మూడు రోజుల్లో గోదావరి నీరు గుండుగొలను సెక్షన్కు చేరుకుంటుందని.. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నందున ఉన్నతాధికారులు గోదావరి కాల్వకు నీటిని విడుదల చేశారన్నారు.
చెరువులలో అడుగంటిన నీరు

తాగునీటి వెతలు