
మాదకద్రవ్యాల వాడకం అడ్డుకట్టకు చర్యలు
ఏలూరు(మెట్రో): యువత భవిష్యత్ను నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ‘నాషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరేట్లో బుధవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగ నివారణ దినోత్సవం సందర్భంగా జూన్ 1 నుంచి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై 1972 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు రవాణా చేసే వారికి కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.మాలిని తదితరులు పాల్గొన్నారు.
29న ద్వారకాతిరుమలలో యోగాంధ్ర
ఈ నెల 29న ద్వారకాతిరుమల హరిత హోటల్ వద్ద, జూన్ 5న పట్టిసీమ రివర్ ఇన్ రిసార్ట్ వద్ద, జూన్ 11న మద్ది ఆంజనేయస్వామి దేవాలయం వద్ద, జూన్ 18న జీలకర్రగూడెం, గుంటుపల్లి బౌద్ధరామాల వద్ద యోగాసనాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.
పందుల సంచారంపై చర్యలు తీసుకోవాలి
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనావాసాలలో పందులు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పందుల బెడద, నియంత్రణపై జిల్లా స్థాయి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. పందుల పెంపకాన్ని జనావాసాల నుంచి ఊరి చివరకు మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఊరి చివర పశువుల షెడ్లు ఏర్పాటుచేయాలని, పెంపకందార్ల పునరావాసానికి ప్రభుత్వ పథకాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.