
అర్జీలపై సత్వర చర్యలు
కలెక్టర్ వెట్రిసెల్వి
చింతలపూడి: ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. సోమవారం చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే సొంగా రోషన్కుమార్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్తో కలిసి ఆమె పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలపై అధికారులు ప్రత్యేక చూపాలన్నారు. ఎమ్మెల్యే రోషన్కుమార్ మాట్లాడుతూ 312 అర్జీలు వచ్చాయని, రెవెన్యూ, పెన్షన్లు, రీసర్వే, అసైన్డ్ భూములు, వైద్యారోగ్యం, ఇరిగేషన్ సంబంధిత అంశాలపై ఫిర్యాదులు ఉన్నాయన్నారు.
అర్జీల్లో కొన్ని..
● టి.నర్సాపురానికి చెందిన పసుమర్తి రాము చింతలపూడి–టి.నర్సాపురం ఆర్అండ్బీ రోడ్డు అధ్వానంగా ఉందని, మరమ్మతులు చేయాలని వినతిపత్రం అందించారు.
● చింతలపూడి మండలం ప్రగడవరానికి చెందిన ఎన్.చరణ్ మోహన్ రెడ్డి తనకు 60 శాతం అంగవైకల్యం ఉందని, పెన్షన్ ఇప్పించాలని అర్జీ అందించారు.
● చింతలపూడికి చెందిన బి.రమణ గ్రామంలోని ఇళ్ల కాలనీలోని రోడ్ల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
● లింగపాలెం మండలం ధర్మాజీగూడేనికి చెందిన కె.ఇస్సాకు తమ గ్రామ సర్వే నం.260.2లో తనకు 0.35 సెంట్ల భూమి ఉందని, దీనిని డిస్టిబ్యూట్ రిజిస్టర్ నుంచి తొలగించాలని కోరుతూ అర్జీ అందజేశారు.
కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, డీసీఓ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు కలెక్టరేట్లో 204 అర్జీలు
ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, అధికా రులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గడువులోపు పరిష్కారం చూపాలని డీఆర్వో ఆదేశించారు. మొత్తంగా 204 అర్జీలు అందాయి.
అర్జీల్లో కొన్ని..
● నిడమర్రు మండలం బువ్వనపల్లికి చెందిన దామిశెట్టి పద్మ తన ఇంటి డూప్లికేట్ పట్టా కోసం వినతిపత్రం అందించారు.
● పెదపాడు మండలం వసంతవాడకి చెందిన యలమంచిలి వరలక్ష్మి పట్టాదారు పాస్బుక్ కోసం అర్జీ అందించారు.
● ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెం వాసి మల్లిబోయిన శోభారాణి తన కుమారుడికి వినికిడి యంత్రం ఇప్పించాలని కోరారు.
● ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు నివాసి మాకా వెంకట సూర్య సత్యనారాయణ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం అర్జీ అందజేశారు.