డిపో సీఐ దురుసు ప్రవర్తనపై నిరసన | - | Sakshi
Sakshi News home page

డిపో సీఐ దురుసు ప్రవర్తనపై నిరసన

Jun 4 2025 1:13 AM | Updated on Jun 4 2025 1:13 AM

డిపో

డిపో సీఐ దురుసు ప్రవర్తనపై నిరసన

ఏలూరు (టూటౌన్‌): ఏపీఎస్‌ ఆర్టీసీ ఏలూరు డిపో ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి డి.ఆంజనేయులుపై డిపో సీఐ దురుసు ప్రవర్తనకు నిరసనగా మంగళవారం స్థానిక ఆర్టీసీ గ్యారేజీ ఎదుట యూనియన్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. యూనియన్‌ ఏలూరు డిపో గౌరవ అధ్యక్షుడు వై.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆంజనేయులు పట్ల సీఐ అలా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. యూనియన్‌ నాయకులు, కమిటీ సభ్యుల పట్ల ఆర్టీసీ అధికారులు సూపర్‌వైజర్‌ చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. వెహికల్‌ కండిషన్‌ మెరుగుపరచాలని పదేపదే మేనేజ్‌మెంట్‌కు చెప్పినా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. డిపోలో కనీస మౌలిక వసతులు లేవని అన్నారు. ఆంజనేయులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని, బుధవారం నుంచి నాన్‌ కోపరేషన్‌ పాటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిపో నాయకులు వీఎస్‌ నారాయణ, ఎండి రమేష్‌, పీకేబీ రాజు, పి.శ్రీహరి పాల్గొన్నారు.

కూలీలు పస్తులుంటే.. యోగాలో నిమగ్నమా!

భీమవరం అర్బన్‌: గత రెండు నెలలుగా ఉపాధి హామీ కూలీలు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. అధికారులందరూ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాలో నిమగ్నమైపోవడం దారుణమని సీఐటీయూ నాయకులు మండిపడ్డారు. భీమవరం మండలంలోని గూట్లపాడు, గొల్లవానితిప్ప గ్రామాల్లో మంగళవారం సీఐటీయూ సంఘం సభ్యులు పర్యటించి ఉపాధి హామీ కూలీలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఎం.ఆంజనేయులు, ఇంజేటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీ పనులు చేసిన 15 రోజుల్లోనే వేతనాలు చెల్లించాలని చట్టంలో ఉన్నా రెండు నెలలు గడుస్తున్నా వేతనాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే యోగాసనాల్లో అధికారులు నిమగ్నమైపోవడం బాధాకరమన్నారు. ఉపాధి హామీ రోజు కూలీ రూ.600 చేసి ఏడాదికి 200 పనిదినాలకు పెంచాలని డిమాండ్‌ చేశారు.

నూతన వంగడాల వైపు

రైతులు మొగ్గు చూపాలి

భీమవరం అర్బన్‌: వ్యవసాయంలో సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ నూతన వంగడాల వైపు రైతులు మొగ్గు చూపాలని ఉండి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ పి. వినయలక్ష్మి అన్నారు. భీమవరం మండలంలోని రాయలం గ్రామంలో మంగళవారం వికసిత్‌ కృషి సంకల్ప అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు నూతన వంగడాలు, వాటి దిగుబడులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వినయలక్ష్మి మాట్లాడుతూ వ్యవసాయంలో నూతన వంగడమైన ఎమ్‌టీయూ 1224 వంగడం గురించి వివరించి దాని బీజం, దిగుబడి గురించి చెప్పారు. జీలుగుమిల్లి సీటీఆర్‌ఐ టుబాకో, ప్రిన్సిపాల్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వై. సుబ్బయ్య, శాస్త్రవేత్త పి. సహదేవరెడ్డి పాల్గొన్నారు.

డిపో సీఐ దురుసు ప్రవర్తనపై నిరసన 1
1/1

డిపో సీఐ దురుసు ప్రవర్తనపై నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement