
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
భీమవరం (ప్రకాశంచౌక్): విధుల్లో నిర్లక్ష్యం వహి స్తూ సమావేశాలకు గైర్హాజరవుతున్న మున్సిపల్ అధికారుల పై, నిర్ధేశిత లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ రీజనల్ డైరక్టర్ సీహెచ్ నాగ నర్సింహరావు హెచ్చరించారు. మంగళవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ హాలులో జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆయా మున్సిపాలిటీలకు నిర్ధేశించిన లక్ష్యాలను, విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై ఆరా తీశారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై స్థానికంగా ఉన్న కమిషనర్లు సస్పెండ్ వరకూ చర్యలు తీసుకోవాలన్నారు. భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు మున్సిపాలిటీలకు సంబంధించి కమిషనర్లు, రెవెన్యూ అధికారులు ప్లానింగ్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. సమావేశంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, సెక్షన్ హెడ్స్ పాల్గొన్నారు.