చిరుద్యోగులే బలి! | - | Sakshi
Sakshi News home page

చిరుద్యోగులే బలి!

May 26 2025 1:09 AM | Updated on May 26 2025 1:09 AM

చిరుద్యోగులే బలి!

చిరుద్యోగులే బలి!

నూజివీడు: గృహనిర్మాణ శాఖకు సంబంధించి నూజివీడు మండలం సుంకొల్లులో మెటీరియల్‌ పంపిణీలో చోటు చేసుకున్న అవినీతి, అవకతవకలపై అవుట్‌సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌లపై చర్యలు తీసుకోవడంపై గృహనిర్మాణశాఖతో పాటు రాజకీయ వర్గాల్లో సైతం విస్మయం వ్యక్తమవుతోంది. సుంకొల్లులో జరిగిన కుంభకోణంపై విచారణ జరపగా 2,450 బస్తాల సిమెంట్‌, 11,952 కిలోల స్టీలు లబ్ధిదారులకు అందలేదని తేలింది. వీటి విలువ రూ.16,52,895గా ధ్రువీకరించారు. దీంతో ఐదుగురు అవుట్‌ సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లపై వేటు వేశారు. అయితే లబ్ధిదారుడికి మెటీరియల్‌ ఇచ్చే విషయంలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల పాత్ర ఏమీ ఉండదనేది అందరికి తెలిసిందే. గృహనిర్మాణ శాఖ అధికారులకు ఈ విషయం తెలిసినప్పటికీ అధికారులపై చర్యలు తీసుకోకుండా వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను బలిపశువులను చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

మెటీరియల్‌ను ఎలా జారీ చేస్తారంటే..

ఇల్లు కట్టుకునే లబ్ధిదారుడికి మెటీరియల్‌ను అందజేసే విషయంలో ఆ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, ఏఈలదే కీలకపాత్ర. అయితే వాళ్లను వదిలేసి ఎలాంటి సంబంధం లేని వర్క్‌ ఇన్‌స్పెక్టర్లపై చర్యలు తీసుకోవడమేమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎంబుక్‌ నమోదు చేసి సిమెంట్‌, ఐరన్‌, ఇసుకకు సంబంధించిన మెటీరియల్‌ రిలీజ్‌ ఆర్డర్‌ జారీ చేసేది సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ కాగా, ఆ కూపన్‌లను తీసుకొని వచ్చిన లబ్ధిదారులకు రిలీజ్‌ ఆర్డర్‌లో పేర్కొన్న మేరకు మెటీరియల్‌ను హౌసింగ్‌కు చెందిన స్టాకు పాయింట్‌ ఇన్‌చార్జి అందజేస్తారు. స్టాక్‌ పాయింట్‌ ఇన్‌చార్జిగా ఏఈ స్థాయి అధికారి ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులపై చర్యలు తీసుకోకుండా వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌లపై చర్యలు తీసుకోవడం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

42 ఇళ్లకు సంబంధించి మెటీరియల్‌ పక్కదారి

సుంకొల్లులో 42 గృహాలకు సంబంధించి ఇళ్లు ప్రారంభించకుండానే మెటీరియల్‌ను డ్రా చేసేశారు. ఒక్కొక్క గృహానికి ఒక్కో విధంగా మెటీరియల్‌ను జారీ చేసేశారు. కొన్ని ఇళ్లకు 10 సిమెంట్‌ కట్టలు, మరికొన్ని ఇళ్లకు 20 సిమెంట్‌ కట్టలు ఇలా వారిష్టమొచ్చినట్లు రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చేశారు. ఈ 42 గృహాలకు సంబంధించి మెటీరియల్‌ రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చిన ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌పైన గాని, పర్యవేక్షణ అధికారులైన ఏఈ, డీఈలపైన గాని ఇంత వరకు చర్యలు లేవు. మెటీరియల్‌ను జారీ చేసిన తరువాత లబ్ధిదారులు గృహాలను నిర్మిస్తున్నారా, లేదా అనే విషయాన్ని ఏఈ, డీఈలు పర్యవేక్షించాలి. అలా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే దుర్వినియోగం జరిగింది. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ అసలు దోషులపై చర్యలు తీసుకోకుండా దీనికి ఎలాంటి సంబంధం లేని వర్క్‌ ఇన్‌స్పెక్టర్లపై చర్యలు తీసుకొని మమ అనిపించేశారు.

ఇళ్ల నిర్మాణ సామగ్రి మాయం

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై వేటు

అధికారులను వదిలేసి.. వర్క్‌ ఇన్‌స్పెక్టర్లపై చర్యలా!

హౌసింగ్‌ ఉన్నతాధికారుల తీరుపై విస్మయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement