
శ్రీవారి సన్నిధిలో కలెక్టర్
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి వనివారం సందర్శించారు. ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. అర్చకులు, పండితుల నుంచి వేద ఆశీర్వచనం పొందారు. ఈఓ ఎన్వీ సత్యనారాయ ణమూర్తి ఆమెకు శ్రీవారి జ్ఞాపిక అందజేశారు. అనంతరం కలెక్టర్ ఆలయ తూర్పు ప్రాంతంలో గజలక్ష్మి నుంచి ఆశీర్వచనం పొందారు. సప్తగోకులాన్ని సందర్శించారు.
కానిస్టేబుళ్ల బదిలీలు
ఏలూరు టౌన్: జిల్లాలో పారదర్శకంగా పోలీస్ బదిలీలు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. చెప్పారు. ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివా రం కానిస్టేబుళ్ల బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. ఐదేళ్ల పాటు ఒకే చోట సర్వీస్ చేసుకున్న సిబ్బంది 286 మందికి బదిలీ ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. అనంతరం కౌన్సెలింగ్కు హాజరైన సిబ్బందికి జిల్లా ఎస్పీ స్వయంగా భోజనాన్ని వడ్డించారు. జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, ఎస్బీ ఎస్సై గంగాధర్రావు, డీసీఆర్బీ ఎస్సై రాజారెడ్డి, కార్యాలయ ఏ1 వైఎస్వీ ప్ర సాద్, హెచ్సీ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల్లో 4,009 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ జనరల్ పరీక్షలకు 3,413 మందికి 3,184 మంది, ఒకేషనల్ పరీక్షలకు 443 మందికి 151 మంది హాజరయ్యారు. సెకండియర్ జనరల్ పరీక్షలకు 656 మందికి 590 మంది, ఒకేషనల్ పరీక్షలకు 103 మందికి 84 మంది హాజరయ్యారు. సబ్జెక్టు పరీక్షలు పూర్తయ్యాయని, బ్రిడ్జి కోర్సు పరీక్షలు జరగాల్సి ఉందని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ అన్నారు.
రేపటి నుంచి ఇంటర్ మూల్యాంకనం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 19 నుంచి ప్రారంభించనున్నట్టు ఏలూరు జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీ య పర్యవేక్షణాధికారి కె.యోహాన్ ప్రకటనలో తెలిపారు. స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూని యర్ కళాశాల ప్రాంగణంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి మూల్యాంకన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. సంస్కృతం, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గణితం, సివిక్స్ సబ్జెక్టుల జవాబుపత్రాలను మూల్యాంకనం చేస్తారన్నారు. ఆయా సబ్జెక్టులకు నియమించింన చీఫ్ ఎగ్జామినర్లు, ఎగ్జామినర్లు సోమవారం ఉదయం 10 గంటలకు, స్కూృటినైజర్లు ఈ నెల 20న ఉదయం 10 గంటలకు శిబిరం వద్ద రిపోర్ట్ చేయాలని సూచించారు.
19న డీఆర్సీ సమావేశం
ఏలూరు(మెట్రో): జిల్లా అభివృద్ధి సమీక్ష కమి టీ సమావేశాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి, పౌరసర ఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పా ల్గొంటారన్నారు.
సచివాలయ కార్యదర్శి సస్పెన్షన్
చింతలపూడి: విధుల్లో నిర్లక్ష్యం వహించిన చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని పాత చింతలపూడి సచివాలయ కార్యదర్శి కె.గంగా భవానీని అధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్కు జీఎస్డబ్ల్యూఎస్ రాష్ట్ర డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌస్ హోల్డ్స్ జియో ట్యాగింగ్ విషయంలో అల సత్వం వహించడంతో పాటు, జీఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్కు గైర్హాజరవడం తదితర అంశాలపై సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇద్దరు గ్రామ కార్యదర్శులపై..
సాక్షి టాస్క్ఫోర్స్: హౌస్హోల్డ్ సర్వేపై నిర్లక్ష్యం వహించిన కారణంగా జిల్లాలో ఇద్దరు గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్కు గ్రామ, వార్డు సచివాలయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ సిఫార్సు చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో జిల్లాలోని భీమడోలు గ్రామ కార్యదర్శి కేవీ లక్ష్మీ తనూజ, టి.నరసాపురం గ్రామ కార్యదర్శి ఉన్నట్టు సమాచారం. దీనిపై భీమడోలు ఎంపీడీఓ సీహెచ్ పద్మావతిదేవిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదన్నారు.