
గూడెం కూటమిలో మంటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘మా కూటమి నేతలు కొంతమంది నేను తొందరగా చనిపోతే బాగుండును... ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిపోవాలని కోరు కుంటున్నారు.. నేనేమి వాళ్ల త్యాగాలతో గెలవలేదు.. నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు.. ఎన్డీఏ ఎమ్మెల్యేను. నా చావును కోరు కోవడం అన్యాయం.. నేను చనిపోయాక ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్న వాళ్ళ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నాను’ అంటూ టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జిని ఉద్దేశించి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన, టీడీపీ నేతల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. తాజాగా తాడేపల్లిగూడెంలో మొదలైన రాజకీయ పోరు తారాస్థాయికి చేరింది. పొత్తుల్లో భాగంగా జనసేన ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్కు సీటు కేటాయించడంతో గెలుపొందారు. ఇదే స్థానం టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జి ఆశించి భంగపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న రీతిలో వివాదాలు కొనసాగుతున్నాయి. అక్రమ గ్రావెల్, మైనింగ్, పేకాట శిబిరాలు, బెల్టుషాపులు, వైన్ షాపుల వసూళ్ల వ్యవహారంలో మొదలైన విబేధాలు తాజాగా రచ్చకెక్కాయి. ఇద్దరు నేతల మధ్య అధికారులు పూర్తిగా నలిగిపోతున్నారు.
అధికారంలో ఉన్నామా..
ప్రతిపక్షంలో ఉన్నామా?: టీడీపీ నేతలు
రెండురోజుల క్రితం నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ పరిశీలకుడు నక్కా చిట్టిబాబు నేతృత్వంలో జరిగింది. ఈ సభలో టీడీపీ నేతలు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి తీరుపై విమర్శలు గుప్పించారు.
మేము అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామా అన్న విషయం తెలియడం లేదని.. చిన్న పని కూడా కార్యకర్తలకు జరగడం లేదని.. పార్టీ నేతలకు ఎక్కడా ఆహ్వానాలు గాని, ప్రొటోకాల్ గాని లేదని, చిన్న పోస్టులు కూడా నియోజకవర్గ ఇన్చార్జి వేయించే పరిస్థితి లేదని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఏకపక్ష ధోరణిలో ఎస్సై మొదలుకొని మున్సిపల్ కమిషనర్ వరకు తన మాటే వినాలని, టీడీపీ వాళ్ళకు పనిచేస్తే సహించేది లేదని హుకుం జారీ చేశారని ఆరోపణలు గుప్పించారు. టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జి ఎన్ఆర్జీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు, అతని వార్డులో రెండు సీసీ రోడ్లు వేయాలని అధికారులకు చెప్పినా ఎవరూ స్పందించడం లేదని సమావేశంలో ఆరోపించారు. ఈ పరిణామాల క్రమంలో బుధవారం నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో బొలిశెట్టి టీడీపీ నేతల ఆరోపణలపై పరోక్షంగా ఘాటుగా స్పందించారు.
ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల గెలవలేదు
తాను ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల గెలవలేదని, మరో పిఠాపురం చేస్తానంటే నేను గాజులు తొడుక్కుని కూర్చొలేదని, కొందరి నాయకుల్లాగా స్థలాలు, పొలాలు పూడ్చుకోలేదని ఎవరి త్యాగం వల్ల తనకు సీటు రాలేదని ఎమ్మెల్యే బొలిశెట్టి బుధవారం వ్యాఖ్యానించారు.
అధికారులను ఇబ్బంది పెట్టినా, బెదిరించినా సహించనని ఎలాంటి హోదా లేకుండా అధికారులను ఇంటికి పిలిచి నాకు తెలియకుండా టీడీపీ నేతలు సమీక్షా సమావేశాలు ఎలా పెడతారంటూ ఆరోపించారు.
జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి మధ్య మాటల యుద్ధం
కూటమి నేతలు కొందరు నా చావును కోరుకుంటున్నారన్న జనసేన ఎమ్మెల్యే
టీడీపీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతల ఆరోపణ
మీ త్యాగాలతో ఎమ్మెల్యే కాలేదంటూ బొలిశెట్టి వ్యాఖ్యలు
చిచ్చు రేపిన అరకమ తవ్వకాలు
నియోజకవర్గంలో ఎర్రకాల్వతో సహా అక్రమ గ్రావెల్ తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతలే రింగ్ లీడర్లుగా మారి భారీగా తవ్వకాలు చేసి ఎమ్మెల్యే సొంత స్థలంలో, టీడీపీ ఇన్చార్జి సొంత లేఅవుట్లలో మట్టిని నింపుతున్నారు. ఈ వ్యవహారాల్లో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. వైన్ షాపులు, అధికారుల పోస్టింగులు, పనుల కేటాయింపులు ఇలా అన్నింటిలోనూ ఈ విభేదాలు పెరిగి వివాదానికి దారితీశాయి. తాడేపల్లిగూడెం కమిషనర్, కొందరు ఎస్సైలు, తహసీల్దార్లను టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్నారని, ఎమ్మెల్యే జనసేన అయినా పైన ప్రభుత్వం మాదని నియోజకవర్గంలో లేకుండా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని జనసేన ఎమ్మెల్యే బహిరంగంగా ఆరోపించారు. అధికారుల జోలికి వస్తే ఎవరిని ఉపేక్షించనని.. ప్రజలు ఓట్లు వేసి అవకాశం ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచానని, చిల్లర వ్యవహారాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ పరోక్షంగా హెచ్చరించారు.

గూడెం కూటమిలో మంటలు

గూడెం కూటమిలో మంటలు