
ధాన్యపు సిరులొలికేనా!
ప్రజా సమస్యలు గాలికి..
సాక్షి, రాజమహేంద్రవరం: ఖరీఫ్ వరి కోతలు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే 500 హెక్టార్లకు పైగా కోతలు పూర్తయ్యాయి. వారం, పది రోజుల వ్యవధిలో మరింతగా పుంజుకునే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ధాన్యం కొనుగోళ్లు ప్రాంభించాల్సి ఉన్నా ప్రభుత్వం నేటికీ ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభిస్తామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా దళారులు, ప్రైవేటు వ్యాపారులు కోతలు పూర్తయిన వెంటనే తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తక్కువ ధర అని తెలిసినా రైతులు వాళ్లకే విక్రయిస్తున్నారు.
‘తూర్పు’లో ఇలా..
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 1.84 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. వరి కోతలు విస్తృతంగా సాగుతున్నాయి. జేసీ మేఘ స్వరూప్ శుక్రవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 221 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాచారు. ఈ–పంటలో నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్దేశించినట్లు పేర్కొన్నారు. గ్రేడ్–ఏ రకం ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 నిర్ణయించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ సారైనా సమయానికి ధాన్యం నగదు అందిస్తారా? 48 గంటల్లో డబ్బులు జమ చేస్తారా? లేదా గత రబీ సీజన్లో ఎదురైన అనుభవాలే మిగులుస్తారా? అన్న సందిగ్ధం వ్యక్తమవుతోంది.
రబీలో రైతులకు అన్యాయం
జిల్లాలో 2024–25 రబీలో వరి సాధారణ విస్తీర్ణం 60,042 హెక్టార్లు కాగా ఈ ఏడాది 58,586 హెక్టార్లలో సాగైంది. 5.11 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. అందులో 60 వేల మెట్రిక్ టన్నులు ఫైన్ వైరెటీ ధాన్యం. మిగిలిన 4.51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. 216 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రక్రియ ప్రారంభించారు. తొలుత 2,63,076 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేసి, లక్ష్యాలను అధిగమించినట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలు ముగియడంతో ధాన్యం కొనుగోళ్లు ఆపేశారు. దీంతో చేసేది లేక రైతులు ఆందోళన బాట పట్టారు. వారి నిరసనలకు దిగివచ్చిన ప్రభుత్వం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతులు ఇచ్చింది. 3.53 లక్షలు సేకరించి అనంతరం కొనుగోలు కేంద్రాలు మూసేసింది. ఇక సేకరించేది లేదంటూ చేతులెత్తేసింది. 30,448 మంది రైతుల నుంచి 3,53,199.280 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. మిగిలిన ధాన్యం వదిలేయడంతో వాటికి విక్రయించేందుకు రైతులు పడిన పాట్లు వర్ణనాతీతమైంది. సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించకుండా చేతులెత్తేసింది.
ధాన్యం డబ్బుల కోసం తిప్పలు
ప్రభుత్వానికి విక్రయించిన ధాన్యానికి సకాలంలో డబ్బులు ఇవ్వలేదు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తామని గొప్పలు చెప్పిన పాలకులు నెలలు గడిచినా ఇవ్వలేదు. గత రబీలో రూ.812.4 కోట్లు విలువ చేసే ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం రూ.682.49 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన రూ.129.91 కోట్లు విడుదల చేయకుండా నానా తిప్పలు పెట్టింది. ఎప్పుడు విడుదలవుతుందని రైతులు ప్రశ్నిస్తే అధికారులు దిక్కులు చూశారు. ప్రస్తుతం అదే పరిస్థితి ఎదురవుతుందా..? డబ్బులు సకాలంలో ఇస్తారా..? అన్న ప్రశ్న రైతుల్లో ఉంది.
గతంలో కోతల వెంటే కొనుగోళ్లు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యం కల్పించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కోతలు ప్రారంభమయ్యే నాటికి రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. కేంద్రాలు ప్రారంభించిన వెంటనే కోనుగోళ్లకు నాంది పలికారు. కొనుగోళ్లకు ముందుగానే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. క్వింటాల్కు రూ.143 పెంచింది. కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది.
విస్తృతంగా కోతలు
జిల్లా వ్యాప్తంగా చాగల్లు, దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు, నల్లజెర్ల, నిడదవోలు, రాజమండ్రి రూరల్ మండలాల్లో వరి కోతలు విస్తృతంగా జరుగుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో సైతం ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కూలీల రేట్లు అధికంగా ఉండటంతో కోతలకు రైతులు యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 75 నుంచి 80 శాతం రైతులు యంత్రాల ద్వారానే కోతలు చేపడుతున్నారు.
జిల్లాలో వరి సాగు ఇలా..
మండలం కోతల విస్తీర్ణం (ఎకరాల్లో)
అనపర్తి 8744.13
బిక్కవోలు 14502.28
చాగల్లు 7901.23
దేవరపల్లి 8580.89
గోకవరం 13993.3
గోపాలపురం 10858.59
కడియం 4870.01
కోరుకొండ 13732.16
కొవ్వూరు 11039.89
నల్లజెర్ల 9065.62
నిడదవోలు 17194.81
పెరవలి 8139.98
రాజమండ్రి రూరల్ 3490.41
రాజానగరం 10530.21
సీతానగరం 13523.45
తాళ్లపూడి 9584.36
ఉండ్రాజవరం 11480.74
రేపటి నుంచి కొనుగోళ్లు
జిల్లా వ్యాప్తంగా
221 కేంద్రాల ఏర్పాటు
ఊపందుకున్న వరి కోతలు
ఆలస్యంగా ధాన్యం సేకరణ
గత సీజన్లో చేతులెత్తేసిన ప్రభుత్వం
ఈసారైనా కనికరిస్తారా
అని అన్నదాత ఎదురుచూపు
ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన ధ్వజం
కడియంలో రచ్చబండి,
కోటి సంతకాల సేకరణ

ధాన్యపు సిరులొలికేనా!

ధాన్యపు సిరులొలికేనా!