అయ్యో.. అసలే వద్దంటారా..! | - | Sakshi
Sakshi News home page

అయ్యో.. అసలే వద్దంటారా..!

May 30 2025 12:09 AM | Updated on May 30 2025 12:09 AM

అయ్యో

అయ్యో.. అసలే వద్దంటారా..!

పంపాలో స్నానాలు వద్దంటున్న దేవస్థానం

యువకుడి మృతితో చర్యలు

అప్రమత్తం చేసే బదులు ఇదేం పని?

ఘాట్‌లలో రక్షణ ఏర్పాట్లు

చేయాలని భక్తుల విన్నపం

అన్నవరం: భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి దర్శనానికి వెళ్లిన వారు గోదావరిలో స్నానం చేయకూడదని బోర్డులు ఏర్పాటు చేసి, సెక్యూరిటీ గార్డులను కాపలా పెడితే ఎలా ఉంటుంది? అన్నవరం పంపా జలాశయం వద్ద ఇటువంటి పరిస్థితే భక్తులకు ఎదురవుతోంది. పంపా జలాశయంలో శ్రీచక్ర స్నానం గొయ్యిలో మునిగిపోయి బుధవారం ఒక యువకుడు మృతి చెందిన విషయం విదితమే. అక్కడ గొయ్యి ఉందని తెలియక, పెద్దగా లోతుండదని భావించి వెళ్లిన అతడు ఆ గోతిలో పడి మృతి చెందాడు. అక్కడ దేవస్థానం అధికారులు ఎటువంటి హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. కనీసం ఆ గొయ్యి చుట్టూ మెష్‌ ఏర్పాటు చేసి, కర్రలు పాతి, జెండాలు అమర్చినా గొయ్యి ఉందనే విషయం అందరికీ తెలిసి ఉండేది. అటువంటి చర్యలేవీ తీసుకోకపోవడంతో ఓ యువకుడి నిండు ప్రాణాలు బలయ్యాయి. ఈ విషాద సంఘటనతో మేల్కొన్న అధికారులు విచిత్రమైన చర్య తీసుకున్నారు. అసలు పంపా జలాశయం వద్దకే వెళ్లవద్దని, అక్కడ స్నానం చేయవద్దని బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఏటా వేసవిలో మార్చి లేదా ఏప్రిల్‌లో శ్రీరామ నవమి వేడుకలు, మే నెలలో సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. అప్పుడు పంపాలో పెద్దగా నీరుండదు. ఈ సందర్భంగా నిర్వహించే చక్రస్నానం కోసం పంపా స్నానఘట్టాలకు కొద్ది దూరంలో నాలుగేళ్ల క్రితం నలు చదరంగా సుమారు ఆరడుగుల లోతున గొయ్యి తవ్వారు. ఏటా ఆ గోతిని నీటితో నింపి చక్రస్నానం నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న కూడా ఈ గోతిలోనే సత్యదేవుని చక్రస్నానం నిర్వహించారు. అయితే, పంపాలోకి నీరు వస్తే ఆ గొయ్యి పూర్తిగా మునిగిపోతుంది. ఒడ్డు నుంచి చూస్తే అక్కడ గొయ్యి ఉందనే విషయమే ఎవ్వరికీ తెలియదు. ఈ విషయం తెలియకే కిర్లంపూడి మండలం జగపతినగరానికి చెందిన వాసంశెట్టి చరణ్‌తేజ్‌ ఆ గోతిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషాద సంఘటన నేపథ్యంలో ‘గేట్లు దాటి లోపలకు వెళ్లేందుకు ప్రవేశం లేదు’ అంటూ అధికారులు పంపా గేట్లకు గురువారం ఫ్లెక్సీలు తగిలించారు. అలాగే, నది వద్ద ‘ఇచ్చట నీటిలో దిగుట ప్రమాదకరం’ అని బోర్డు ఏర్పాటు చేశారు. అలాగే, పంపాలో స్నానం చేయడం నిషిద్ధమని బోర్డులు పెట్టారు. దీంతో, పంపా జలాశయానికి స్నానం చేయడానికి వస్తున్న భక్తులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

పుణ్యస్నానాలకు వందలాదిగా..

పవిత్ర పంపా నదిలో స్నానం చేసి, సత్యదేవుని దర్శించుకోవాలని చాలా మంది భక్తులు భావిస్తూంటారు. అలాగే, అన్నవరం చుట్టుపక్కల ప్రజలు కూడా పండగలు, ఇతర పర్వదినాలు, గణపతి నవరాత్రుల్లో నిమజ్జనాలు, దసరా నవరాత్రుల్లో భవానీ మాలలు వేసిన వారితో పాటు కార్తిక మాసం నెల పొడవునా ఉదయం, సాయంత్రం వందలాది మంది పంపాలో పుణ్యస్నానాలు ఆచరిస్తూంటారు. పంపాలో స్నానం చేయకుండా వీరిని నియంత్రించడం సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో దేవస్థానం అధికారులు తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలి. ప్రమాదం గురించి అందరికీ తెలిసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కానీ మొత్తానికే స్నానం చేయవద్దంటే ఎలాగని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

ఈ చర్యలు మేలు

● స్నానం చేయవద్దని కాకుండా స్నానఘట్టాల వద్ద కొద్ది దూరంలో సత్యదేవుని చక్రస్నానం కోసం తీసిన గొయ్యి ఉందని, అందువలన స్నానం చేసేందుకు అక్కడి వరకూ వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరిక బోర్డులు పెట్టాలి.

● చక్రస్నానం గొయ్యి చుట్టూ కర్రలు పాతి, వాటికి జెండాలు కట్టాలి.

● ప్రస్తుతం పంపా నీటిమట్టం 88 అడుగులకు చేరింది. వర్షాలు ఇంకా పడుతున్నాయి కనుక నీటిమట్టం త్వరలోనే 90 అడుగులకు చేరుతుంది. అప్పుడు స్నానఘట్టాల వరకూ నీరు వస్తుంది. అప్పుడు భక్తులు ఒడ్డునే స్నానం చేసే అవకాశం ఉంటుంది.

● గోదావరి, కృష్ణా నదుల స్నాన ఘట్టాల మాదిరిగా పంపా స్నాన ఘట్టాలకు కొద్ది దూరం వరకూ మాత్రమే భక్తులు వెళ్లేలా ఇనుప స్తంభాలు పాతి, ఇనుప గొలుసులు లేదా మెష్‌లు ఏర్పాటు చేయాలి. అలా చేస్తే, భక్తులు అవి దాటి నది లోపలకు వెళ్లే అవకాశం ఉండదు.

అయ్యో.. అసలే వద్దంటారా..!1
1/1

అయ్యో.. అసలే వద్దంటారా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement