
సైనిక సంక్షేమానికి చర్యలు
రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో సైనిక సంక్షేమ నిధికి వచ్చిన విరాళాలను సైనికులకు, వారి కుటుంబాలకు అందజేసి, ఆర్థిక భరోసా, సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల గ్రూపులు అందించిన రూ.6,37,790 చెక్కును సైనిక సంక్షేమ అధికారికి కలెక్టర్, ఎస్పీ గురువారం అందచేశారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, సైనిక సంక్షేమ నిధికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని కోరారు. ఎస్పీ డి.నరసింహ కిషోర్ మాట్లాడుతూ, సైనిక సంక్షేమ నిధి ద్వారా సేకరించిన విరాళాలను మాజీ సైనికులు, యుద్ధ వితంతువులు, వికలాంగులైన మాజీ సైనికులు, రక్షణ సిబ్బంది కుటుంబాల సంక్షేమం, పునరావాసానికి వెచ్చిస్తారని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎన్వీఎస్ మూర్తి, సైనిక సంక్షేమ అధికారి కార్యాలయం సహాయ సంచాలకుడు డాక్టర్ సత్యకుమార్, డీపీఎం బి.హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అర్జీలను త్వరితగతిన పరిశీలించాలి
రాజమహేంద్రవరం సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు సమర్పిస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారులు, అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆమె వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రీ సర్వేకి సంబంధించిన రాజానగరం గురించి 3, కోరుకొండ నుంచి 1, చాగల్లు నుంచి 6 అర్జీలు వచ్చాయన్నారు. వీటిని పరిశీలించామని, పరిష్కారం విషయంలో కచ్చితత్వం, జవాబుదారీతనం కలిగి ఉండాలని అధికారులను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 95523 00009ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవాలని సూచించారు.