‘నా భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారు’ | - | Sakshi
Sakshi News home page

‘నా భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారు’

May 30 2025 12:09 AM | Updated on May 30 2025 12:09 AM

‘నా భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారు’

‘నా భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారు’

ఏఈఓపై మరో ఆరోపణ

సీఎంఓకు ఫిర్యాదు చేసిన భక్తుడు

విచారణ జరిపి నివేదిక సమర్పించాలని

ఈఓకు ఉన్నతాధికారుల ఆదేశం

అన్నవరం: ఏఈఓ కె.కొండలరావుపై మరోసారి ఆరోపణలు రావడం అన్నవరం దేవస్థానంలో కలకలం రేపింది. తెలంగాణలోని మంచిర్యాల నుంచి సత్యదేవుని సన్నిధిలో సేవ చేయడానికి వచ్చిన తమ పట్ల కొండలరావు దురుసుగా ప్రవర్తించారని మహిళా సేవకులు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై మండిపడిన దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ ఈ వ్యవహారంపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావును ఆదేశించారు. ఈ మేరకు కొండలరావుకు షోకాజ్‌ నోటీసు కూడా జారీ అయ్యింది. ఈ వివాదం ఇంకా ముగియక ముందే ఆయనపై మరో భక్తుడు తీవ్ర స్థాయి ఆరోపణలతో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంఓ) ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఆయన ఫిర్యాదు ప్రకారం..

ఏం జరిగిందంటే..

హైదరాబాద్‌కు చెందిన భక్తుడు హోతా కామేశ్వరశాస్త్రి ఈ నెల 13వ తేదీ రాత్రి జరిగిన సత్యదేవుని శ్రీపుష్పయాగం కార్యక్రమానికి అన్నవరం వచ్చారు. రూ.2 వేల టికెట్టుతో సత్యదేవుని వ్రతమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా అక్కడి పురోహితుడు రాత్రి స్వామివారి శ్రీపుష్పయాగ మహోత్సవం జరుగుతుందని చెప్పడంతో కామేశ్వరశాస్త్రి దంపతులు హైదరాబాద్‌ ప్రయాణం రద్దు చేసుకున్నారు. సత్యదేవుని శ్రీపుష్పయాగానికి హాజరయ్యారు. ఈ ఉత్సవం ముగిసిన తరువాత ప్రసాదం తీసుకునేందుకు అర్చకుని వద్దకు వెళ్లగా, తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి తన భార్య భుజంపై చేయి వేసి తోసేశారని, అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. దీంతో, తాను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానన్నారు. ఆ వ్యక్తి దేవస్థానం ఉద్యోగి కె.కొండలరావుగా అక్కడి సిబ్బంది ద్వారా తెలుసుకున్నానని పేర్కొన్నారు. వెంటనే కింద పడిపోయిన తన భార్యను లేవదీసి, ఈఓకు ఫిర్యాదు చేద్దామనుకున్నానన్నారు. అప్పటికే ఈఓ కొండ దిగువకు వెళ్లిపోయారని తెలిసి హైదరాబాద్‌ వచ్చేశామని పేర్కొన్నారు. తన భార్యతో పాటు ఇతర భక్తుల పట్ల అతడి ప్రవర్తన అదేవిధంగా ఉందని ఆ ఫిర్యాదులో కామేశ్వరశాస్త్రి పేర్కొన్నారు. ఆయనపై చర్య తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు కాపీని దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి గురువారం దేవస్థానానికి పంపించి, దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఈఓను ఆదేశించారు. దీనిపై విచారణాధికారి ద్వారా విచారణ చేయించనున్నట్లు ఈఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement