థియేటర్ల బంద్‌ నిర్ణయం జరగలేదు | - | Sakshi
Sakshi News home page

థియేటర్ల బంద్‌ నిర్ణయం జరగలేదు

May 29 2025 7:17 AM | Updated on May 29 2025 7:17 AM

థియేటర్ల బంద్‌ నిర్ణయం జరగలేదు

థియేటర్ల బంద్‌ నిర్ణయం జరగలేదు

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): జూన్‌ 1నుంచి సినిమా థియేటర్ల బంద్‌ నిర్ణయం జరగలేదని తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు కోళ్ల అచ్యుత రామారావు(బాబు) స్పష్టం చేశారు. బుధవారం రాజమహేంద్రవరంలో ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సినిమా థియేటర్ల మనుగడ కోసం దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చర్చించుకోవడానికి తూర్పు గోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం నిర్వహించామన్నారు. జనవరి, ఏప్రిల్‌ నెలల్లో రెండుసార్లు తమ సంఘం ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయని, థియేటర్ల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించామన్నారు. హైదరాబాద్‌లో మే 13న సమావేశం జరిగిందని, ఆ సమావేశంలో నైజాంలో అమల్లో ఉన్న పర్సంటేజీల విధానం ఆంధ్రాలోను అమలు చేయాలనే వాదన వచ్చిందన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు జూన్‌ ఒకటి నుంచి ఎవరికి వారు థియేటర్లను సొంత నిర్ణయంపై నడుపుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌ ప్రకటన రావడంతో నైజాంకు చెందిన కొందరు పెద్దలు సినిమా రిలీజ్‌ను అడ్డుకోవాలని కుట్ర చేయడం వాస్తవమన్నారు. అయితే ఆ నెపాన్ని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎగ్జిబిటర్‌ అత్తి సత్యనారాయణపై నెట్టివేశారని ఆరోపించారు. సినిమా హాల్స్‌ నిర్వహించడం ఆర్థికంగా నష్టదాయకమని, నిర్మాతలు పర్సంటేజీలు ఇస్తేనే ప్రదర్శనలు జరుగుతాయన్నారు. సమస్య పరిష్కారానికి సినీ నిర్మాత మండలి, నటీనటుల సంఘం (మా), ప్రభుత్వం సమష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

హీరోలు ఏడాదికి రెండు సినిమాలు

చేస్తే థియేటర్లకు మనుగడ

హీరోలు ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తేనే థియేటర్లకు మనుగడ ఉంటుందన్నారు. ఒక్కో హీరో సినిమా రెండేళ్లకు పైగా పడుతోందని దీనివల్ల సినిమాలు లేక థియేటర్‌లో కొన్ని షోలు నిలుపుకోవాల్సి వస్తోందన్నారు. థియేటర్లలో అధికారుల తనిఖీలు సర్వ సాధారణమన్నారు. సినిమాలకు ప్రేక్షకులే రానప్పుడు తినుబండారాల అమ్మకాలు ఏం జరుగుతాయన్నారు. భారీ బడ్జెట్‌ సినిమాలు రిలీజ్‌ అయ్యినప్పుడు టిక్కెట్‌ ధరలు పెంచడం వల్ల సినిమాకు వచ్చే ప్రేక్షకులతో తిట్లు తినాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధిక ధరలు వల్ల నేల టిక్కెట్లు అమ్ముడు పోవడం లేదన్నారు. థియేటర్లు వ్యవహారంపై ఈనెల 30విశాఖలో ఏపీ ఫిల్మ్‌ చాంబర్‌, డిస్ట్రిబ్యూటర్ల సంయుక్త సమావేశం జరుగుతుందన్నారు. సంఘ ఉపాధ్యక్షుడు ఎం.సదాశివ, డి.శ్రీనివాస్‌, సభ్యులు జి.రామారావు, జాస్తి బాపయ్య పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు

అసోసియేషన్‌ అధ్యక్షుడు కోళ్ల బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement