
మనపై మనకు నమ్మకముంటే సివిల్స్ కష్టం కాదు
316వ ర్యాంకర్ కీర్తిరెడ్డి
నల్లజర్ల: సివిల్స్లో 316వ ర్యాంకు సాధించిన శ్రీనివాస కీర్తిరెడ్డి, ఆమె భర్త శ్రీసాయి (ఐఏఎస్ అధికారి, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అధికారి, విజయవాడ) ఆదివారం పోతవరంలోని బంధువుల ఇంటికి వచ్చారు. వారిని సమీప బంధువు గన్నమనేని దొరయ్య, ఆయన సోదరులు వెంకటేశ్వరరావు, ప్రభాకరరావు, మాజీ సర్పంచ్ పసుమర్తి రాధ సత్కరించారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ, ఆగస్టులో తాను శిక్షణకు వెళ్తున్నానని చెప్పారు. బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ చదివానని, మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చినా కాదనుకున్నానని అన్నారు. పెళ్లయినా సరే ఎలాగైనా సివిల్స్ సాధించాలని కంకణం కట్టుకొని ఐదుసార్లు విఫలమయ్యానని, ఆరోసారి రెట్టింపు ఉత్సాహంతో 316వ ర్యాంకు సాధించానని తెలిపారు. రోజుకు దాదాపు 8 గంటలు చదివానని, మొదటి మూడుసార్లు పాసవుతానన్న గ్యారంటీ లేదని అన్నారు. సివిల్స్కు ఎంపిక కాలేనేమోనని భయం వేసిందని, అయితే, మనపై మనకు నమ్మకముంటే సివిల్స్ సాధించడం కష్టం కాదని మూడో ప్రయత్నం తర్వాత తెలుసుకున్నానని వివరించారు. ఐదో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకూ వెళ్లానని, కష్టపడటం, నమ్మకం, ఆశతో ముందుకెళ్లి ఆరోసారి విజయం సాధించానని తెలిపారు. తన విజయం వెనుక తల్లిదండ్రులు, భర్త, అత్తమామల ప్రోత్సాహం ఎంతో ఉందని కీర్తిరెడ్డి చెప్పారు.