● స్వర్ణకార కార్పొరేషన్కు నిధులు, విధులు కేటాయించాలని నిరసన
● బంగారం కొనద్దన్న మోడీ పిలుపుతో
ఆందోళన
అమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వర్ణకార కార్పొరేషన్కు నిధులు, విధులు కేటాయించాలని, బంగారం కొనద్దన్న పీఎం నరేంద్రమోడీ పిలుపుతో స్వర్ణకారుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆ వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ జిల్లాలో విజయవంతమైంది. జిల్లాలో దాదాపు 1400, అమలాపురం పట్టణంలో 300 దుకాణాలను మూసివేసి స్వర్ణకారులు బంద్లో పాల్గొన్నారు. జిల్లా విశ్వ బ్రాహ్మణ, స్వర్ణకార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బంద్లో పాల్గొని అనంతరం స్థానిక ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేశారు. అమలాపురం వీధుల్లో వారు సమస్యలపై నినదిస్తూ ర్యాలీ చేసి అనంతరం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ బ్యాంకుల్లో బంగారం తాకట్టు మీద రూ.2.50 లక్షలు దాటితే ఇన్కం టాక్స్ రిట్నర్నులు ఇవ్వాలన్న నిబంధనను ఎత్తివేసి రూ.10 లక్షల పైబడిన వాటికి వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. అమలాపురం గోల్డ్ మార్కెట్లో పట్టణ విశ్వ బ్రాహ్మణ, స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన జరిగింది. స్వర్ణకార సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి చేబ్రోలు చంద్రశేఖర్, జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు తాళాబత్తుల అప్పలాచార్యులు, విశ్వ బ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షుడు కట్టోజు సన్నయ్యదాసు, అమలాపురం స్వర్ణకార సంఘం అధ్యక్షుడు మానేపల్లి సత్యప్రకాష్ పాల్గొన్నారు.


