వాడపల్లి క్షేత్రంలో భక్తుల కిటకిట
వెంకన్నకు రూ.10.12 లక్షల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడింది. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రానికి శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రాగా, కార్తిక మాసం తొలి ఆదివారం కారణంగా ఈ వారం మరింత ఎక్కువగా తరలివచ్చారు. అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వేంకటేశ్వరస్వామితో పాటు, ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకుని భక్తులు పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారికి వేలాదిగా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డూ విక్రయం తదితర రూపాల్లో ఒక్కరోజు దేవస్థానానికి రూ.10,11,540 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు.


