
పోలీస్ గ్రీవెన్స్కు 20 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 20 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా నిర్వహించిన ఈ గ్రీవెన్స్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదులు అందించారు. ఈ ఫిర్యాదులపై జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కచ్చితంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. అమలాపురం హైస్కూల్ సెంటరులోని దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ దిమ్మకు టీడీపీ నాయకులు జెండాలు, ఫ్లెక్సీల కట్టడంపై చర్యలు తీసుకోవాలని పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సంసాని బులినాని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎక్కువగా ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు రాగా అర్జీదారులతో ఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు.
సుబ్రహ్మణ్యేశ్వరునికి
వెండి వస్తువుల సమర్పణ
ముమ్మిడివరం: గాడిలంకలోని శ్రీసంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఓ దాత రూ. లక్ష విలువ చేసే వెండి పళ్లెం, వెండి శఠగోపం సమర్పించారు. వీటిని విజయవాడకు చెందిన కాంట్రాక్టర్ సాయిచందు, యుక్తప్రియా దంపతుల కుమారుడు కార్తికేయ కియాన్ సమకూర్చారు. వారి తరఫున గాడిలంకకు చెందిన కొమ్మిరెడ్డి సతీష్కుమార్, దివ్యతేజ దంపతులు సోమవారం ఆలయ పురోహితుడు శేఖర్శర్మ సమక్షంలో నిర్వాహకులు గిరిగి సత్యసాయిరామ్, పిండి లక్ష్మణరావుకు అందజేశారు.
జాతీయ స్థాయి తైక్వాండో
పోటీలకు ఎంపిక
అంబాజీపేట: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు అంబాజీపేట విద్యార్థినులు ఎంపికై నట్లు సీనియర్ కోచ్ పితాని త్రిమూర్తులు తెలిపారు. సోమవారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఆ విద్యార్థులను పలువురు అభినందించారు. ఈ నెల 10 నుంచి 12 వరకూ బాపట్ల జిల్లా పేటేరు జెడ్పీ హైస్కూల్లో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో స్కూల్ గేమ్స్లో 20 కిలోల విభాగంలో కుడుపూడి కావ్య సుందరి హరిప్రియ మొదటి స్థానం, 24 కిలోల విభాగంలో ఎరుబండి ఇషా నాగశ్రీనిజ రెండో స్థానాన్ని కై వసం చేసుకున్నారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచినందుకు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. పంజాబ్లో త్వరలో జరగబోయే జాతీయ స్థాయి తైక్వాండో స్కూల్ గేమ్స్లో పాల్గొనున్నారన్నారు. ఈ విద్యార్థులు, కోచ్లు త్రిమూర్తులు, పితాని భార్గవి శ్రీకళ, నారాయణలను పలువురు అభినందించారు.
మెరుగైన ఉత్తీర్ణతకు ప్రణాళిక
అమలాపురం టౌన్: వచ్చే పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని డీఈఓ షేక్ సలీమ్బాషా సూచించారు. అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పాఠ్యాంశ నిపుణులతో డీసీఈబీ సెక్రటరీ బి.హనుమంతరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. సమగ్ర శిక్షా జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ (ఏసీపీ) జి.మమ్మీ మాట్లాడుతూ గత ఏడాది జిల్లా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిందని గుర్తు చేశారు. ఈ ఏడాది మొదటి స్థానం సాధించే దిశగా ముందస్తు ప్రణాళికతో విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. జిల్లా సైన్స్ అధికారి సుబ్రహ్మణ్యం, ఎస్జీఎఫ్ సెక్రటరీ ఈశ్వరరావు, సమగ్ర శిక్షా ఏఎంఓ బీవీవీ సుబ్రహ్మణ్యం, ఏఎంఓ పి.రాంబాబు, జీసీడీఓ డాక్టర్ ఎంఏకే భీమారావు పాల్గొన్నారు.

పోలీస్ గ్రీవెన్స్కు 20 అర్జీలు

పోలీస్ గ్రీవెన్స్కు 20 అర్జీలు