
రూ.72.23 లక్షలకు కొబ్బరి చెక్కల వేలం
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల కొట్టిన కొబ్బరి చెక్కలను పోగుచేసుకునే వేలం రూ.72,23,499కు ఖరారైంది. ఈ ఏడాది నవంబర్ 16 నుంచి వచ్చే ఏడాది నవంబర్ 15 వరకూ ఏడాది పాటు కొబ్బరి చెక్కలు తీసుకునేందుకు బుధవారం అమలాపురం ఆలయ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో వేలం నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ – టెండర్, సీల్డ్ టెండర్, బహిరంగ వేలం ద్వారా పాట జరిగింది. తొండంగి మండలం సీతారామపురానికి చెందిన గింజాల నాగ వెంకట సత్తిబాబు రూ.72,23,499కు పాట దక్కించుకున్నాడు. గతేడాది రూ.45 లక్షలకు వెళ్లి వేలం ఈ సారి మరింత పెరిగిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.