
గౌరవానికి భంగం!
గౌరవ వేతనం విడుదల చేయాలి
ఇమామ్లకు, మౌజన్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం సొమ్ముల వెంటనే విడుదల చేయాలి. పేద ఇమామ్లు, మౌజన్లు వీటి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా అందేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మసీద్ల నిర్వహణ సొమ్ముల బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలి.
– ఎండీవై షరీఫ్, రాజోలు
కుటుంబాలు
గడవడం కష్టంగా ఉంది
ఇమామ్, మౌజన్లకు కూటమి ప్రభుత్వం 11 నెలల నుంచి గౌరవ వేతం ఇవ్వకపోవడం వల్ల వారి కుటుంబాలు గడవడం చాలా ఇబ్బందిగా మారింది. ఆదాయాలు లేని మసీదుల నిర్వహణ కష్టతరంగా మారింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతి మూడు నెలలకు గౌరవ వేతనాలు అందేవి. ఈ ప్రభుత్వం వాటిని తక్షణం విడుదల చేయడంతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.
– వి.ఖాదర్ బాషా, వైఎస్సార్ సీపీ
మైనార్టీ సెల్ అధ్యక్షుడు, అమలాపురం
సాక్షి, అమలాపురం: సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఇచ్చిన శ్రీసూపర్ సిక్స్శ్రీ హామీలనే కాదు.. అంతకు మించి హామీలు గుప్పించింది. సూపర్ సిక్స్ హామీలనే పూర్తి స్థాయిలో అమలు చేయని కూటమి ప్రభుత్వం మిగిలిన హామీలను కూడా అరకొరగా అమలు చేస్తూ లబ్ధిదారులను మోసం చేస్తోంది. ఇందుకు ఉదాహరణ ఇమామ్, మౌజన్, పాస్టర్లకు ఇస్తానన్న గౌరవ వేతనాల పంపిణీ ఒక్కటి. నెలల తరబడి బకాయిలు ఉండడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కోనసీమ జిల్లాలో ఇమామ్, మౌజన్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాల కోసం లబ్ధిదారులు ఎదురు తెన్నులు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు కావస్తుండగా ఎనిమిది నెలల పాటు గౌరవ వేతం ఇవ్వాల్సి ఉంది. దీనితో పాటు ఎన్నికల సమయంలో మూడు నెలల పాటు గౌరవ వేతనం రావాల్సి ఉంది. ఎన్నికల సమయంలో సాంకేతిక కారణాల వల్ల వీరికి రావాల్సిన సొమ్ములు ఆగిపోయాయి. ఈ రెండు కలిపితే మొత్తం 11 నెలల పాటు వారికి గౌరవ వేతనాలు అందాల్సి ఉంది. జిల్లాలో 125 వరకు చిన్న మసీదులున్నాయి. వీటిలో ఒక ఇమామ్, మౌజన్ల చొప్పున సేవలందిస్తున్నారు. ఇమామ్లకు నెలకు రూ.పది వేల చొప్పున ఒక్కొక్కరికీ రూ.1.10 లక్షల చొప్పున ఇవ్వాల్సి ఉంది. మొత్తం జిల్లాలో 125 మందికి కలిపి మొత్తం రూ.1.37 కోట్ల వరకు రావాల్సి ఉంది. అలాగే మౌజన్లకు రూ.5 వేల చొప్పున ఒక్కొక్కరికీ రూ.55 వేల చొప్పున జిల్లా వ్యాప్తంగా రూ.68.75 లక్షలు ఇవ్వాల్సి ఉంది. వీరిద్దరికీ కలిపి మొత్తం రూ.2,05,75,000 చెల్లించాల్సి ఉంది.
ఇదే కాకుండా ఎన్నికల ముందు మైనార్టీలకు చెందిన మసీదుల నిర్వహణ నిమిత్తం కూడా నెలకు రూ.ఐదు వేల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని మసీదులనేది స్పష్టత లేకున్నా కనీసం చిన్న మసీదుల నిర్వహణకు సొమ్ములు ఇచ్చినా నెలకు రూ.ఐదు వేల చొప్పున జిల్లాలోని 125 మసీదులకు సంబంధించి నెలకు రూ.6.25 లక్షల చొప్పున అందించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలానికి రూ.87.5 లక్షలు అందించాల్సి ఉన్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. షాదీ తోఫా పేరుతో రూ.లక్ష ఇస్తామన్నారు. ఈ హామీకి సైతం కూటమి ప్రభుత్వం గ్రహణం పట్టించింది.
చిన్న చర్చిలలో పనిచేస్తున్న పాస్టర్లకు సైతం గౌరవ వేతనం అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వేల మంది వరకు ఉంటారని అంచనా. వీరికి నెలకు ఐదు వేల చొప్పున ఏడు నెలలు వేతనాలు అందడం లేదు. వీరికి ఒక్కొక్కరికీ రూ.35 వేల చొప్పున అందించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల మందికి పైగా లబ్ధిదారులు ఉంటారని అంచనా.
వైఎస్సార్ సీపీ హాయంలో మొదలు
ఆదాయం తక్కువగా ఉండే చిన్న మసీదులపై ఆధారపడి జీవించే ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనాలు ఇవ్వడం అనేది గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మొదలైంది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి క్రమం తప్పకుండా గౌరవ వేతాన్ని చెల్లించేవారు. ఇవే కాకుండా వైఎస్సార్ బీమాను వర్తింప చేయడంతో పాటు ఇమామ్లకు జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలకు రుణాలు అందజేశారు. వీరితో పాటు క్రిస్టియన్ మైనార్టీ వర్గానికి చెందిన పాస్టర్లకు సైతం నెలకు రూ.ఐదు వేల చొప్పున అందించడం కూడా ప్రారంభించారు. వీరికి కూడా జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం గమనార్హం. ఈ కారణంగానే ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీరు చూసి గత ప్రభుత్వంలో జరిగిన మేలును వారు గుర్తు చేసుకుంటున్నారు.
ప్రభుత్వాన్ని ప్రశిస్తున్న
ఇమామ్, మౌజన్, పాస్టర్లు
వేతన బకాయిల కోసం
ఎదురు చూపులు
జిల్లాలో మసీదులకు
రూ.2.06 కోట్ల వరకు బకాయి
షాదీ తోఫాను విస్మరించారు
పేద పాస్టర్లను ఆదుకోవాలి
ప్రభుత్వం పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతం రూ.ఐదు వేలు వెంటనే విడుదల చేయాలి. పేద పాస్టర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. నెలలు గడుస్తున్నా గౌరవ వేతనం ఇవ్వకపోవడం వల్ల పేద పాస్టర్లు ఇబ్బంది పడుతున్నారు.
– బిషప్ ఎం.స్పర్జన్రాజు, సియోను ప్రార్థనా
మందిరం, రంగాపురం, అమలాపురం మండలం

గౌరవానికి భంగం!

గౌరవానికి భంగం!

గౌరవానికి భంగం!