
స్వదేశానికి క్షేమంగా చేరిన మహిళ
మస్కట్ నుంచి రప్పించిన కోనసీమ మైగ్రేషన్ అధికారులు
అమలాపురం రూరల్: మస్కట్ దేశంలో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఓ మహిళను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు క్షేమంగా స్వదేశానికి రప్పించారు. తమ తల్లిని స్వదేశానికి రప్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన సురెళ్ల దివ్య కలెక్టరేట్లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ను పది రోజుల క్రితం ఆశ్రయించింది. కేంద్రం ప్రతినిధులు స్పందించి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మన్యం నాగమణిని ఇండియాకు రప్పించినట్టు డీఆర్వో, కేంద్రం నోడల్ అధికారి కొత్త మాధవి సోమవారం తెలిపారు. ఆగర్రు గ్రామానికి చెందిన సురెళ్ల దివ్య తల్లి నాగమణి ఉపాధి కోసం 9 నెలల క్రితం మస్కట్ దేశానికి వెళ్లింది. కొంతకాలం నుంచి ఆమె ఆరోగ్యం బాగోలేక, ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమెను ఇండియాకు రప్పించడానికి కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. ఆమెను పంపించిన ఏజెంట్ను అడిగితే రూ.1.60 లక్షలు కడితే కానీ ఆమెను రప్పించలేమని స్పష్టం చేశాడు. వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో, డబ్బు సర్దుబాటు కుదరలేదు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్కుమార్ కలెక్టరేట్లో ప్రత్యేకించి వలసదారుల కోసం సెంటర్ ఫర్ మైగ్రేషన్ ఏర్పాటు చేశారని, విదేశాలకు వెళ్లే వారికి అండగా ఉంటోందని తెలుసుకుని ఈ కేంద్రాన్ని దివ్య ఆశ్రయించింది. కేంద్రం అధికారులు సంబంధిత ఏజెంట్తో మాట్లాడి, సమస్యను పరిష్కరించి.. నాగమణిని క్షేమంగా మస్కట్ నుంచి రప్పించే ఏర్పాట్లు చేశారు. సోమవారం నాగమణి హైదరాబాద్కు చేరుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
స్వగ్రామానికి మృతదేహం
అంబాజీపేట: పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన కాగిత అర్జమ్మ ఉపాధి కోసం బెహరాన్ దేశం వెళ్లి పదేళ్లుగా అక్కడే పని చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 14న అనారోగ్యంతో ఆమె అక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు రూ.3 లక్షల ఖర్చవుతుండడంతో ఆమె కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) అండగా నిలిచింది. నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్తో కలిసి ఈ సంస్థ ఖర్చులు భరించి, అర్జమ్మ మృతదేహాన్ని సోమవారం ఇంటి వద్ద బంధువులకు అప్పగించారు. ఇందుకు కృషి చేసిన ఆయా సంస్థల ప్రతినిధులకు మృతురాలి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

స్వదేశానికి క్షేమంగా చేరిన మహిళ