
ఎఫ్ఐఆర్తో ఆచూ‘కీ’
పిఠాపురం: ఒక కేసులో ఎఫ్ఐఆర్ కాకినాడ జిల్లా పోలీసు యంత్రాగానికి తలనొప్పిగా మారిన హత్య కేసు మిస్టరీని ఛేదించేలా చేసింది. నాలుగు బృందాలు 60 రోజులుగా చేస్తున్న దర్యాప్తును ఒక్క ఎఫ్ఐఆర్ కొన్ని గంటల వ్యవధిలోనే ఆధారాలతో సహా నిందితులను పట్టించినట్లు సమాచారం. గత ఫిబ్రవరి 28న గొల్లప్రోలు మండలం చేబ్రోలు 216 జాతీయ రహదారి పక్కన లభ్యమైన గుర్తుతెలియని మృతదేహం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించినట్లు తెలిసింది. ఈ కేసులో మృతదేహం లభ్యమవ్వడం తప్ప ఎటువంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. ఈ కేసు దర్యాప్తునకు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు రెండు నెలలుగా చనిపోయిన వ్యక్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. 30 నుంచి 40 ఏళ్ల వయసు గల ఒంటిపై దుస్తులు, ఇతర వస్తువులు లేకుండా పడి ఉన్న పురుషుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం హత్య కేసుగా నిర్ధారణకు వచ్చారు. మృతుడి దుస్తులు, మొలతాడు, చేతి కంకణం మృతదేహం పడి ఉన్న సమీపంలోనే దొరకడంతో పాటు మృతుడి ఒంటిపై కత్తి పోట్లు ఉండడంతో అతనిని ఎవరో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానించి ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు మృతుడి ఫొటోలు పంపిన పోలీసులు వ్యక్తులు గల్లంతు అయిన సంఘటనలపై ఆరా తీశారు. అయినా ఏవిధమైన ఆధారం లభించలేదని తెలిసింది.
ఆన్లైన్లో చూసి..
ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ఆదివారం ఒక మిస్సింగ్ కేసుకు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. దానిని అక్కడి పోలీసులు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. పిఠాపురంలో హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందం ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ చూసి ఆ కేసుకు సంబంధించిన ఫొటోను పరిశీలించారు. మిస్సింగ్ అయిన వ్యక్తి.. ఇక్కడ దొరికిన మృతదేహం ఒకటేనని గుర్తించారు. అక్కడకు వెళ్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడినట్లు విశ్వసనీయ సమాచారం. భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడినట్లు తెలిసింది. రెండు నెలలుగా తన కుమారుడు కనిపించడం లేదని ఒక తల్లి ఇచ్చిన ఫిర్యాదులో ఇచ్చిన ఫొటోను ఇక్కడ లభ్యమైన మృతదేహం ఫొటోతో సరి చూడగా రెండు ఒకటే కావడంతో కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. మృతుడు లోవరాజు (37) రైళ్లలో చిన్న చిన్న దొంగతనాల్లో నిందితుడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మృతుని భార్య తన భర్తను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ప్రియుడి సహాయంతో హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి పడేసినట్లు సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకున్న యలమంచిలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలలుగా కాకినాడ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ముప్పుతిప్పలు పెట్టిన హత్య కేసు మిస్టరీ వీడడంతో ఇక్కడి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.