పెళ్లి పత్రిక ఇచ్చేందుకు వచ్చి.. ఒంటరి మహిళపై
అన్నానగర్: మదురై సమీపంలో పెళ్లి పత్రికగా ఇవ్వడానికి వచ్చి ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళను కట్టేసి 17 సవర్ల నగలు, రూ.70 వేలు నగదు దోచుకెళ్లిన ముగ్గురిని పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. మదురై జిల్లా మేలూరు సమీపంలోని కీళవలవు గ్రామానికి చెందిన షణ్ముగ సుందరం. ఖతార్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని భార్య హేమలత (42). వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు మదురైలోని హాస్టల్లో చదువుతున్నాడు.
హేమలత తన కూతురితో కలిసి కింది ఇంటిలో నివసిస్తోంది. మంగళవారం హేమలత కూతురు ట్యూషన్ చెప్పేందుకు పక్కనే ఉన్న ఇంటికి వెళ్లింది. హేమలత ఇంటిలో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన 40 ఏళ్ల ఓ వ్యక్తి, ఇద్దరు యువతులు ఆమె ఇంటికి వచ్చారు. పెళ్లి పత్రిక ఇవ్వడానికి వచ్చామంటూ ఇంటిలోకి ప్రవేశించి హేమలతను కట్టేసి 17 సవర్ల నగలు, రూ.70 వేలు నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ విషయమై పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు.
చదవండి: జైలుకెళ్లినా బుద్ధి మారలే.. సహజీవనం చేయాలని కానిస్టేబుల్ ఒత్తిడి