
అవినీతి కూటమి
శ్రీరంగరాజపురం: కూటమి ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తోందని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. శనివారం పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంగాధరనెల్లూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఎటువంటి అనుమతులు లేకుండా స్థానిక ఎమ్మెల్యే, అతని అనుచరులు ఇసుక, గ్రావెల్, గ్రానైట్ను దోచుకుంటున్నారన్నారు. ఇటీవల ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు హరీష్యాదవు ఒక క్వారీ యజమాని నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని గుర్తుచేశారు. పాలసముద్రం, శ్రీరంగరాజపురం మండలాల్లో గుట్టలను మాయం చేస్తున్నారని ఆరోపించారు.
సీబీఐ విచారణ చేపట్టాలి
ఎమ్మెల్యే థామస్ చేస్తున్న అవినీతిపై సీబీఐతో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు గిట్టుబాటు ధర లేక అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు. మామిడికి పరిశ్రమలు అందించే టోకన్లు సైతం బ్లాక్లో అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.