
పేరుకుపోయిన ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు
● అప్పు చేసి చదువుకుంటున్న పేద విద్యార్థులు ● బకాయిలు విడుదల చేయకుండా మొండికేస్తున్న కూటమి నేతలు ● ఏడాదిగా భృతి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ● రేపు కలెక్టరేట్ ఎదుట యువత పోరుకు వైఎస్సార్సీపీ సన్నద్ధం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వివిధ కళాశాలల్లో 2,30,456 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసి డీఎస్సీ, గ్రూపు పరీక్షలు, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ తదితర ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు 90 వేల మందికి పైగా ఉన్నారు. ఉన్నత చదువులు చదివి అరకొర జీతంపై ఆధారపడి స్థానికంగా, ఇతర రాష్టాలకు వెళ్లి వ్యాపార, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. వీరిలో ఎంతోమంది తమ చదువుకు తగ్గ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు.
హామీలిచ్చి..తుంగలో తొక్కి
కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలతో పాటు 147 హామీలు ఇచ్చి గద్దెనెక్కింది. ఏడాదిగా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అటకెక్కించింది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని ప్రకటించి చేతులు పైకెత్తేసింది. ఏటా 20 లక్షల ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇలా.. ఎన్నో హామీలను తుంగలో తొక్కేసింది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,85,458 మంది నిరుద్యోగులు భృతికోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.
2014లో ఇదే తరహా మోసం
2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 600కు పైగా హామీలిచ్చి గద్దెనెక్కారు. ఆపై ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. జాబు రావాలంటే..బాబు రావాలి.. అంటూ ఊదరగొట్టారు. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని కపట ప్రేమ కురిపించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు యువనేస్తం పేరుతో ముందుకొచ్చి సవాలక్ష ఆంక్షలు విధించారు. భృతిని రూ.వెయ్యికి కుదించేశారు. అప్పట్లో చిత్తూరు జిల్లాలో లక్షకు పైగా నిరుద్యోగులు ఉండగా ప్రభుత్వం విధించిన నిబంధనలతో పథకానికి 12 వేల మంది మాత్రమే అర్హత సాధించారు.
ఊసేలేని ఫీజు రీయింబర్స్మెంట్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు. విద్యాదీవెన, వసతిదీవెన నిధుల కోసం విద్యార్థులు ఏడాదిగా ఎదురుచూడాల్సి వస్తోంది. గత వైఎస్సార్సీపీ పాలనలో త్రైమాసికం ముగిసిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.
‘నేను మారాను.. మిమ్మల్ని మారుస్తాను. నన్ను నమ్మండి. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి ఇస్తాం. ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఫీజురీయింబర్స్మెంట్తో ఉన్నత విద్యకు బాటలు వేస్తాం. ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తాం. పేద విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తాం’ అంటూ గత ఎన్నికల్లో కూటమి నేతలు ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించారు. బాబు ష్యూరిటీ..భవిష్యత్తు గ్యారంటీ అంటూ యువతరాన్ని బుట్టలో వేసుకున్నారు. తీరా గద్దెనెక్కిన తర్వాత తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీలన్నీ అటకెక్కించేసి నిరుద్యోగులను రోడ్డున పడేశారు. ఫీజురీయింబర్స్ బకాయిలు విడుదల చేయకుండా పేద విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ పోరుబాటకు సిద్ధమైంది. సోమవారం కలెక్టరేట్ ఎదుట యువతపోరుకు సన్నద్ధమవుతోంది. యువతపోరుపై ‘సాక్షి’ గ్రౌండ్రిపోర్ట్..
జిల్లా సమాచారం
డిగ్రీ కళాశాలలు 116
ఇంజినీరింగ్ కళాశాలలు 14
ఐటీఐ కళాశాలలు 18
నర్సింగ్ కళాశాలలు 07
పాలిటెక్నిక్ కళాశాలలు 08
మెడికల్ 02
బీఈడీ 07
ఎంబీఏ, ఎంసీఏ 11
మొత్తం కళాశాలలు 183
ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు
నియోజకవర్గం విద్యార్థులు పెండింగ్
మొత్తం (రూ.కోట్లల్లో)
చిత్తూరు 2,517 4,82,02,359
నగరి 3,444 6,20,96,235
పుంగనూరు 4,694 8,76,63,867
పూతలపట్టు 3,006 6,28,15,905
పలమనేరు 4,252 6,99,16,920
కుప్పం 3,049 5,04,42,063
గంగాధరనెల్లూరు 3,187 6,64,84,512
మొత్తం 24,149 44,76,21,861
భృతి ఇవ్వాల్సిందే
నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నాం. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి యువత, విద్యార్థులు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలి.
– మనోజ్రెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు
వలసలే గతి
జాబ్ క్యాలెండర్ లేక, నిరుద్యోగ భృతి అందక ఉన్నత చదువులు చదివిన యువతీయువకులు వలసబాట పడుతున్నారు. బీటెక్, ఎంటెక్, పీజీ, తదితర చదువులు చదివిన యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు లేక ప్రైవేట్ రంగాలవైపు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చైన్నె తదితర నగరాల్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగాలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వందలాది మంది నిరుద్యోగులు స్థానికంగానే చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలకు వయస్సు దాటి పోతుండడంతో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం చాలా మంది వేచి చూస్తున్నారు.
రేపు కలెక్టరేట్ వద్ద యువత పోరు
పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి, జాబ్క్యాలెండర్ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరుద్యోగుల పక్షాన యువత పోరుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు అమూల్ డెయిరీ వద్ద విద్యార్థులు, యువతతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టనున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాలోని నలుమూలల నుంచి యువత, ఉన్నత విద్యనభ్యసించిన విద్యార్థులు సిద్ధమవుతున్నారు.

పేరుకుపోయిన ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు

పేరుకుపోయిన ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు

పేరుకుపోయిన ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు