
యువతకు కూటమి దగా
● నేడు జిల్లా కేంద్రంలో ‘యువతపోరు’ నిరసనలు ● అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్కు ర్యాలీ ● హామీలు అమలు చేయాలని కలెక్టర్కు వినతిపత్రాలు
చిత్తూరు కలెక్టరేట్/కార్పొరేషన్ : సార్వత్రిక ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసింది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినప్పటికీ నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా మాట తప్పింది. ఇందుకు నిరసనగా వైఎస్సార్సీపీ యువజన విభాగం నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కారుపై నిరసన గళం వినిపించేందుకు సిద్ధమైంది. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో యువత పోరు నిరసన చేపట్టనున్నారు.
అగమ్య గోచరంగా చదువులు
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇంత వరకు సంక్షేమ పథకాలు అమలు చేయని దుస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలు ఊసే లేకుండా పోయాయి.
పేద కుటుంబాల్లో పిల్లల చదువులు అగమ్యగోచరంగా మారాయి. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటికీ గతంలో ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకా పెండింగ్లో పెట్టారు. జిల్లాలో 183 ఉన్నత కళాశాలల్లో చదువుతున్న 24,149 మంది విద్యార్థులకు రూ.44.76 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఫలితంగా ఉన్నత చదువులకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
నిరసన కార్యక్రమం ఇలా....
జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న అమూల్ డెయిరీ వద్ద యువత పోరు నిరసన కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లాలోని వివిధ మండలాల నుంచి యువత విచ్చేయనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేయనున్నారు. ఆ తర్వాత కలెక్టర్కు డిమాండ్ల వినతిపత్రం అందజేయనున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలి
పలు శాఖల్లో ఉద్యోగుల తొలగింపును వెంటనే ఆపాలి.
ఇప్పటికే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి
20 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలి
జాబ్ క్యాలెండర్ను ప్రకటించి పోస్టులను భర్తీ చేయాలి
గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి
నిరుద్యోగ భృతి అమలు చేసి నిధులు కేటాయించాలి.
నిరుద్యోగ భృతి విడుదల చేయాలి.

యువతకు కూటమి దగా