
‘తెల్ల’బోయే దోపిడీ
● తమ్ముళ్ల అక్రమ గ్రానైట్ దందా ● రైతుల భూముల్లో దౌర్జన్యంగా పనులు ● యథేచ్ఛగా పేలుళ్లు ● నిలదీసిన వారికి బెదిరింపులు ● పట్టించుకోని అధికారులు
చంద్రన్నే కాపాడాలి
మా కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీ అభిమానులం. మా అందరికీ పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి. మా తాతగారి నుంచి వచ్చిన భూమిలో గుట్టలు ఉన్న ప్రాంతంలో నీలగిరి చెట్లు పెట్టుకుని, మరికొంత విస్తీర్ణం చదును చేసి సేద్యం చేసుకుని బతుకుతున్నాం. కానీ ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉండి కూడా మా భూముల్లో దౌర్జన్యంగా రాళ్లు తవ్వుతుంటే ఏమీ చేయలేకపోతున్నాం. రాత్రింభవళ్లు జరుపుతున్న పేలుళ్లతో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియడం లేదు. మా పొలంలోకి వెళ్లాలంటే భయంగా ఉంటోంది.మా చంద్రన్నే (సీఎం) స్పందించి మమ్మల్ని కాపాడాలి.
– మురుగేష్, బాధిత రైతు, జేబి కొత్తూరు
అక్రమంగా రాళ్లను ఎత్తుకుపోతున్నారు
మా అనుమతి లేకుండా, మాకు కనీసం సమాచారం ఇవ్వకుండా మా భూముల్లో రాళ్లను బ్లాకులుగా కత్తిరించి ఎత్తుకుపోతున్నారు. శాంతిపురంలో ఉన్న పెద్ద నాయకుడు వెనుక ఉండి పెద్దూరులో ఉన్న చిన్న నాయకుడితో ఈ పని చేయిస్తున్నాడు. అడిగితే కేసులు పెడతామని, ఆఫీసర్లకు చెప్పి మాకు ఉన్న భూములను కూడా పీకేసుకుంటామని అంటున్నారు. ఎవరికి చెప్పినా పట్టించుకునే వారు లేకపోయారు. మా పార్టీ అధికారంలో ఉన్నా మా బతుకులకు దిక్కు లేకుండా పోయింది.
– మునిరాజు, బాధిత రైతు, జేబీ కొత్తూరు
శాంతిపురం : అధికార అండతో కొందరు తెలుగు తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. సీఎం ప్రాతినిధ్యంలోని ప్రాంతంలో సొంత పార్టీలోని వారే వద్దని వారించినా అడ్డగోలుగా దందా సాగిస్తున్నారు. విలువైన గ్రానైట్ (తెల్లరాయి)ను అక్రమంగా తరలిస్తూ రూ.లక్షలు దోచేస్తున్నారు. దీనికి అడ్డు చెప్పిన వారికి నరకం చూపుతున్నారు. తమ భూముల్లో రాళ్ల తవ్వకం పనులు చేయొద్దన్న పాపానికి ఓ కుటుంబాన్ని వేధిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. విపక్షంలో ఉండగా అక్రమ క్వారీలను ఆపాలని పోరాటం చేసిన చంద్రబాబు పాలనలోనే కుప్పంలో కుప్పలు తెప్పలుగా అక్రమ క్వారీలు సాగుతున్నాయి.
121 పెద్దూరు పంచాయతీలోని జేబీ కొత్తూరు వద్ద ఉన్న పులిగుండ్లపల్లి ప్రాంతంలో రెండు నెలలుగా అక్రమ క్వారీ పనులు చేస్తున్నారు. రైతుల అధీనంలోని అసైన్డ్ భూముల్లో ఉన్న భారీ రాళ్లను కత్తిరించి బ్లాకులుగా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పేలుడు పదార్థాలను యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. దీనికి అభ్యంతరం చెప్పిన రైతు కుటుంబాలను బెదిరింపులతో నోరు నొక్కుతున్నారు.
గుట్టలపై కన్నేసి చెట్ల తొలగింపు
జేబీ కొత్తూరుకు చెందిన మునెప్ప కుమారులైన వెంకటరాజు, మునిరాజు, నారాయణస్వామికి అసైన్డ్ భూములు ఉన్నాయి. భాగ పరిష్కారాల్లో అన్నదమ్ములు వీటిని పంచుకున్నారు. అవకాశం ఉన్న మేర భూములు చదును చేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. మిగతా భూమి గుట్టలు ఎక్కువగా ఉండటంతో వాటి మధ్య నీలగిరి చెట్లు నాటుకుని వాటి ద్వారా ఆదాయం పొందుతున్నారు. కానీ ఆ గుట్టలపై కన్నేసిన టీడీపీ నాయకులు నీలగిరి చెట్లను పెకిలించి వేసి క్వారీ పనులకు పూనుకున్నారు. కంప్రెషర్లు, హిటాచీలతో బ్లాకులను సిద్ధం చేసి కర్ణాటక మీదుగా తెల్లరాయిని తరలిస్తున్నారు. తమ నీలగిరి చెట్లను ధ్వంసం చేయడంపై రైతులు అభ్యంతరం చెప్పడంతో వారిని భయాందోళనకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా మొత్తం భూములను లాక్కుంటామని, ఓవరాక్షన్ చేస్తే కేసులు పెట్టి బొక్కలో వేస్తే జన్మలో బయటకు రాలేరని దబాయింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కావడంతో ఆ పార్టీలోని ఇతర నాయకులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది. ఎట్టకేలకు వారు గత్యంతరం లేక మీడియాకు సమాచారం ఇచ్చారు.
తమ గోడును వెలుగులోకి తెచ్చి న్యాయం జరిగేలా చూడాలని, సీఎం చంద్రబాబు స్పందించి తమకు, తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అధికార పార్టీలో పట్టున్న నాయకులు సాగిస్తున్న ఈ అక్రమ బాగోతంపై అధికారులు ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు.

‘తెల్ల’బోయే దోపిడీ

‘తెల్ల’బోయే దోపిడీ

‘తెల్ల’బోయే దోపిడీ

‘తెల్ల’బోయే దోపిడీ

‘తెల్ల’బోయే దోపిడీ

‘తెల్ల’బోయే దోపిడీ