
మామిడికి ‘తమిళ’ సెగ
● జిల్లాలోని మామిడిని కొనలేమంటున్న ర్యాంపు నిర్వాహకులు ● తమిళనాడు కాయలకు ప్రాధాన్యం ఇవ్వాలని రోడ్డెక్కిన అక్కడి రైతులు ● క్రిష్ణగిరిలో ఫ్యాక్టరీల ఎదుట క్యూకట్టిన వాహనాలు ● జిల్లాలోని మామిడి కాయలకు తమిళ రైతుల సెగ ● కాయలు వద్దంటున్న క్రిష్ణగిరి ఫ్యాక్టరీలు ● కొనుగోలుకు విరామం ప్రకటించిన ర్యాంపులు
కాణిపాకం : మామిడి కొనుగోలు ర్యాంపులకు తమిళనాడు రైతుల సెగ తగులుతోంది. అక్కడి తోతాపురి కాయలు రోడ్డు పాలు కావడంతో తమిళ రైతులు రోడ్డెక్కుతున్నారు. స్థానికంగా పండిన పంటకు ప్రాధాన్యం ఇవ్వాలని అక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. క్రిష్ణగిరిలోని ఫ్యాక్టరీలపై దండ యాత్రకు దిగుతున్నారు. దీంతో అక్కడి ఫ్యాక్టరీలు ఆంధ్రా కాయలను వెనక్కు నెట్టుతున్నారు. ఈ దెబ్బతో జిల్లాలోని ర్యాంపులు కాయలు కొనలేమని చేతులెత్తేస్తున్నారు. ఆరు రోజుల వరకు కొనుగోలుకు విరామం పలకనున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 23 ర్యాంపులున్నాయి. ఈ ర్యాంపులు తోతాపురి కాయలను కొనుగోలు చేసి జిల్లాలోని పలు ఫ్యాక్టరీలకు తరలించడంతో పాటు అధికంగా తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరిలోని పండ్ల గుజ్జు పరిశ్రమలకు తరలిస్తున్నాయి. 30 నుంచి 40 శాతం కాయలు జిల్లాలోని వివిధ ఫ్యాక్టరీలు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటే..మిగిలిన 60 నుంచి 70 శాతం పంటను తమిళనాడులోని క్రిష్ణగిరికి పంపుతున్నాయి. ఈ క్రమంలో ర్యాంపు నిర్వాహకులకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి.
క్రిష్టగిరిలో పరిస్థితి ఇదీ..
తమిళనాడులోని క్రిష్ణగిరిలో గుజ్జు పరిశ్రమలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ పరిశ్రమలకు తోతాపురి కాయలు భారీగా క్యూ కడుతున్నాయి. ఒక్కో ఫ్యాక్టరీ వద్ద వందల లారీలు, ట్రాక్టర్లు కిక్కిరిస్తున్నాయి. ఇవీ అన్ లోడింగ్ కావాలంటే ఐదు రోజుల సమయం పడుతోంది. ఈ కారణంగా పలు వాహనాల్లోని కాయలు మాగిపోతున్నాయి. దీంతో అక్కడి రైతులు కాయలను రోడ్డుపైనే పడేసి వెళ్లిపోతున్నారు. ఈ సమస్య ఉధృతం కావడంతో అక్కడి రైతులు రోడ్డెక్కారు. తమిళనాడు రైతులను ముందు వరుసలో పెట్టాలని ఫ్యాక్టరీని ముట్టడించారు. దీని దెబ్బకు అక్కడి ఫ్యాక్టరీలు తలొగ్గాయి.
జిల్లా అధికారులు చెప్పే ధరకు కొనలేం
తమిళనాడులోని వేలూరు, క్రిష్ణగిరి మార్కెట్లో తోతాపురి కేజీ రూ.2 నుంచి రూ.2.50 అమ్ముడవుతోంది. ఇక్కడ రూ.3.50 నుంచి రూ.4 వరకు కొనుగోలు చేయమంటున్నారు. ఇదీ సాధ్యం కాదు. తమిళనాడులోని ఫ్యాక్టరీలు కిలో రూ.4కు కొంటున్నాయి. మేము అదే రేటుకు కొంటే..చేతులు కాల్చుకోవాల్సిందే. ఒక్కో లారీలో 20 వేల టన్నుల కాయలు పంపుతున్నాం. టన్నుకు రూ.1300 నుంచి రూ.1500 వరకు ఇస్తున్నాం. ఇలా ఒక్క లోడ్ పంపించాలంటే లారీకి మొత్తం రూ.30 వేల వరకు ఖర్చువుతోంది. అక్కడి రైతుల సెగతో ఇక్కడి కాయలు వద్దని చెప్పారు. కాయలు కొనుగోలు ఆపేస్తున్నాం. ఈ రోజే కొనుగోలు ఆఖరు.
– విజయన్, ర్యాంపు నిర్వాహకులు, చిత్తూరు
కాయలు వద్దంటున్న నిర్వాహకులు
తమిళళనాడులో తలెత్తిన సెగతో క్రిష్ణగిరిలోని ఫ్యాక్టరీలు జిల్లా కాయలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదు. అక్కడి కాయలు రోడ్డుపాలు కావడం, రైతుల నిరసనలు, ధర్నాలతో జిల్లా కాయలను వద్దంటున్నారని ర్యాంపు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కారణంగా కాయల కొనుగోలు వారం రోజుల పాటు నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది వరకు రోజుకు 15 లక్షల టన్నుల కాయలు జిల్లా నుంచి క్రిష్ణగిరికి ఎగుమతి చేస్తున్నారు. తోతాపురి కిలో రూ.2 నుంచి రూ.2.50కు కొనుగోలు చేసి..అక్కడి ఫ్యాక్టరీలో రూ.4 వరకు విక్రయిస్తున్నారు. ఇక జిల్లా యంత్రాంగం రూ.3.50 నుంచి రూ.4 వరకు కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ ధరకు తాము కొనలేమని ర్యాంపు నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు.
జిల్లా నుంచి క్రిష్ణగిరికి కాయలు తరలించాలంటే లారీ బాడుగలే రూ. 30 వేలు వ్యయమవుతోందని వారు వివరిస్తున్నారు. దీనికి తోడు తమిళనాడులోని వేలూరు, క్రిష్ణగిరి ప్రాంతాల్లోని మార్కెట్లో తోతాపురి కేజీ రూ.2 నుంచి రూ.2.50కు పలకడంతో జిల్లాలోని ర్యాంపు నిర్వాహకులు అదే రేటును ఫిక్స్ చేశారు. ఇవన్నీ కూడా సిండికేట్ దెబ్బ అంటూ...రైతులు మండిపడుతున్నారు.

మామిడికి ‘తమిళ’ సెగ

మామిడికి ‘తమిళ’ సెగ