
23న యువత పోరు
● వాల్పోస్టర్ విడుదల చేసిన విజయానందరెడ్డి ● అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ
చిత్తూరు కార్పొరేషన్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘యువతపోరు’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు మనోజ్రెడ్డి తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో యువతపోరు వాల్పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు చిత్తూరులోని అమూల్ డెయిరీ వద్ద విద్యార్థులు, యువతతో కలిసి ర్యాలీగా బయలుదేరుతామన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేసి, సమస్యల పై కలెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు.
అస్తవ్యస్తంగా చదువులు
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదని మండిపడ్డారు. విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని వాపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన పథకాల ఉసేలేవన్నారు. పేద కుటుంబాల్లో పిల్లలు చదవులు అగమ్యగోచరంగా మారినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా ఫీజులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయన్నారు.
గత ప్రభుత్వంలో విద్యకు పెద్దపీట
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.18,663 కోట్లతో 27 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించిందన్నారు. పెండింగ్లోని ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ నిర్వహణ ఖర్చుల కింద రూ.7,800 కోట్లు చెల్లించినట్టు గుర్తుచేశారు. కాగా కూటమి ప్రభుత్వం ఫీజుల కింద రూ.700 కోట్లు ఇచ్చామని చెబుతున్నా ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. ఈ విద్యా సంవత్సరం రూ.3,900 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు.
జాబ్క్యాలెండర్ ఎక్కడ?
చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు మనోజ్రెడ్డి మాట్లాడుతూ మీకు రూ.15వేలు... అంటూ ఉకదంపుడు ప్రచారం చేసిన నాయకులు ఇప్పుడు రూ.13వేలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. అదేఽ విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చేతులు పైకెత్తేశారని ఎద్దేవా చేశారు. డీఎస్సీ నోటీఫికేషన్ ఇచ్చినా నిబంధనల పేరుతో అభ్యర్థులకు నష్టం కలిగించారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4 లక్షల మంది ఉద్యోగులను తొలగించారని తెలిపారు. భృతి ద్వారా అందాల్సిన వేలకోట్లు నిరుద్యోగులు నష్టపోయారన్నారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కేపీ.శ్రీధర్, చిత్తూరు రూరల్ యువత అధ్యక్షుడు స్లాండ్లీ, జిల్లా విద్యార్థి జేఏసీ చైర్మన్ సద్దాం, నాయకులు రెడ్డిసాయి, శబరీష్, హితీష్, ప్రవీన్, తరుణ్, సచిన్ పాల్గొన్నారు.