
ప్రతిశాఖలోనూ మహిళా కమిటీలు
– రెండో రోజు కలెక్టరేట్లో మహిళా కమిషన్ సమీక్ష
తిరుపతి అర్బన్ : ప్రతి శాఖలోనూ అంతర్గత మహిళా కమిటీలను ఏర్పాటు చేయాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మంజుదార్ ఆదేశించారు. రెండో రోజు శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజుతో కలసి అధికారులతో సమీక్షించారు. ప్రాథమిక దశలోనే శాఖల సమన్వయంతో పనిచేస్తే మహిళా సమస్యలకు సులభంగా పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పని చేసే ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించాలంటే ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లుకు సంబంధించిన యాక్ట్ను పటిష్టం చేయాలన్నారు. మహిళలకు సంబంధించిన ప్రతి సమస్యకు జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తుందని తెలిపారు. మహిళలపై నేరాలు ఎక్కువ కావడానికి కారణం సరైన అవగాహన లేకపోవడం, భద్రత కలిగించకపోవడం ప్రధాన కారణమని తెలిపారు. మరోవైపు రాష్ట్రాలలో బాల్య వివాహాలు జరగడంతో యుక్త వయసులోనే గర్భం దాల్చడం వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని, మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేసి అరికట్టే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. జాతీయ మహిళా కమిషన్ సూచనలు క్రమం తప్పకుండా పాటించి లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో జిల్లాలో మహిళల పై జరుగుతున్న నేరాలను అరికట్టే దిశగా కృషి చేస్తామని తెలిపారు. మహిళల్లో ఆర్థిక సాధికారత సాధించినప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. జిల్లాలో బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయం నుంచి ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీస్ అందుబాటులో ఉంటారని తెలిపారు. వీరందరూ కూడా మహిళలపై జరుగుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్పీ హర్షవర్ధన్రాజు మాట్లాడుతూ.. జాతీయ మహిళా కమిషన్ సూచనల మేరకు జిల్లాలోని మహిళలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వివరించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ మెంబర్ రోఖాయా బేగం, మహిళా పోలీస్ డిఎస్పి శ్రీలత, కృష్ణకుమారి జాయింట్ డైరెక్టర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వసంత భాయి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.