
విలీనం మా కొద్దు
బైరెడ్డిపల్లె: ‘విలీనం మాకొద్దు. మా గ్రామంలోనే పాఠశాలను పునరుద్ధరించాలి. ఇతర గ్రామాలకు మా విద్యార్థులను పంపించేది లేదు’ అని బైరెడ్డిపల్లె సచివాలయ పరిధిలోని మిట్టపల్లె గ్రామస్తులు తేల్చిచెప్పారు. ఈ మేరకు శుక్రవారం పలమనేరు–కుప్పం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లితండ్రులు మాట్లాడుతూ తమ గ్రామంలో 36 మంది విద్యార్థులు ఉన్నారని, అందులో 3, 4, 5 తరగతుల విద్యార్థులను పక్క గ్రామమైన నాగిరెడ్డిపల్లె పాఠశాలలో విలీనం చేశారని చెప్పారు. పక్క గ్రామానికి వెళ్లే టప్పుడు వ్యవసాయ పొలాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఉన్నతాదికారులు స్పందించి తమ గ్రామంలోనే పాఠశాలను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న బైరెడ్డిపల్లె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థుల తల్లితండ్రులతో సంప్రదించారు. సుమారు అర్ధగంటపాటు ధర్నా చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కుక్కలతో తీవ్ర ఇబ్బందులు
మండలంలోని ఆకులకొత్తూరు గ్రామంలో ఉన్న పాఠశాల విద్యార్థులను చలగానిపల్లెలో విలీనం చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని తల్లిదండ్రులు ఎంఈఓ సుబ్రమణ్యంకు ఫిర్యాదు చేశారు. గురువారం విద్యార్థులు పాఠశాల నుంచి తమ గ్రామానికి వస్తుండగా కుక్కల బెడదతో భయాందోళనకు గురయ్యారని వాపోయారు. పిల్లల భవిషత్తును దృష్టిలో పెట్టుకొని విలీనం ఆపాలని కోరారు.