
సిఫారసులు అనుమతించొద్దు
కార్వేటినగరం: మామిడి కాయల రవాణాలో ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా చూడాలని కలెక్టర్ సుమిత్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మండలంలోని అన్నూరు వద్ద ఉన్న ఏబీసీ జ్యూస్ కర్మాగారాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. మామిడి రవాణాలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాయలను దిగుమతి చేసుకోవాలని, మామిడి కొనుగోళ్లలో సిఫార్సులకు తావు లేకుండా చూడాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ నాగరాజు, సీఐ హనుమంతప్ప, వ్యవసాయశాఖ అధికారిణి హేమలత, ఏబీసీ జ్యూస్ పరిశ్రమ మేనేజర్ వెంకటేశ్వర్లు, నాగేశ్వరరాజు, యుగంధర్ ఉన్నారు.
రిక్వెస్ట్, మ్యూచువల్కే అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సమగ్రశిక్ష శాఖ పరిధిలో నిర్వహిస్తున్న బదిలీల్లో రిక్వెస్ట్, మ్యూచువల్కు మాత్రమే అవకాశం ఉన్నట్లు జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా సమగ్రశిక్ష శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియ మొదలైందన్నారు. జిల్లాలోని కేజీబీవీల్లోని కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, మండల స్థాయిలో పనిచేస్తున్న ఐఈఆర్పీ, పీటీ, సీఆర్ఎంటీలు, అకౌంటెంట్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, సైట్ ఇంజిర్లకు బదిలీలు నిర్వహిస్తామన్నారు. బదిలీలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 21న చివరి తేదీ అని తెలిపారు. అభ్యర్థుల స్టేషన్ సీనియారిటీ, స్పెషల్ సర్వీస్, సీనియారిటీ పాయింట్లను ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లాలనుకునేవారు దరఖాస్తులను రాష్ట్ర కార్యలయానికి పంపించాల్సి ఉంటుందని ఏపీసీ వెల్లడించారు.