
మహిళల రక్షణకు అండగా నిలుస్తాం
● కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరణ ● జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మంజుదార్
తిరుపతి అర్బన్ : మహిళల రక్షణకు.. వారి హక్కుల పరిరక్షణకు మహిళా కమిషన్ కృషి చేస్తోందని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మంజుదార్ వెల్లడించారు. తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం రాష్ట్రీయ మహిళా ఆయోగ్ ఆప్కే ద్వార్, మహిళా జన్ సున్వై అనే కార్యక్రమాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మంజుదార్ పలువురు మహిళల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వాటికి పరిష్కారం చూపలేకపోవడానికి కారణాలను అధికారులు వెల్లడించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని...వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. తిరుపతి జిల్లాలోను కేసుల సంఖ్య ఎక్కువగానే ఉందని వెల్లడించారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు హెల్ప్లైన్, మెయిల్ అందుబాటులో ఉందని...వాటి ద్వారా ఫిర్యాదులు చేయవచ్చునని చెప్పారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం, వారి సమస్యలను చెప్పుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన ప్రతి సమస్యను పర్సనల్గా తీసుకొని పరిష్కారం చూపేలా మహిళా కమిషన్ కృషి చేస్తుందని తెలిపారు. తిరుపతి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తీవ్ర అసంతృప్తిలో మహిళలు
నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ సభ్యులు డాక్టర్ అర్చన మజుందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ఆయా శాఖల సమక్షంలో విచారించే కార్యక్రమంపై పలువురు మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపకపోగా తిరిగి కొత్తగా ఫిర్యాదు చేయాలనే సమాధానమే చెప్పడంతో నిరాశ చెందారు. పోలీసులు మహిళలను వేధిస్తున్న సమస్యలే అధికంగా వచ్చాయి. అయితే వీటి పరిష్కారానికి మళ్లీ పోలీసులనే కలవమని చెప్పడంపై అసంతృప్తికి గురయ్యారు.
అధిక సంఖ్యలో వయోవృద్ధులు చిన్నపిల్లలతో మహిళలు హాజరై మధ్యాహ్నం భోజనం కూడా లేకుండా నిరీక్షించినప్పటికీ సమస్యలు అపరిష్కతంగా మిగిలిపోవడంతో అనేక మంది మహిళలు నిరాశతో వెనుదిరిగారు.