
మూలకోనలో వ్యక్తి మృతి
పుత్తూరు: మండలంలోని మూలకోనలో తిరుపతికి చెందిన ధర్మ (38) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. బుధవారం తిరుపతికి చెందిన ఆరుగురు ద్విచక్ర వాహనాల్లో పుత్తూరు మండలంలోని మూలకోనలో సరదాగా గడిపేందుకు వచ్చారు. వారిలో ఽతిరుపతి బాలాజీ నగర్కు చెందిన ధర్మ అతిగా మద్యం సేవించడంతో అపస్మారక స్థితికి వెళ్లి మృతిచెందాడు. సహచరుల ఫిర్యాదుతో పుత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ధర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య మంజు, కుమారుడు హేమంత్ ఉన్నారు.
గుండ్లపల్లిలో యథేచ్ఛగా కోడిపందేలు
పెద్దపంజాణి/పలమనేరు: పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలం, కొళత్తూరు పంచాయతీ గుండ్లపల్లిలో యథేచ్ఛగా కోడిపందేలు సాగుతున్నాయి. గురువారం జరిగిన పోటీలకు ఆ ప్రాంతం వారే కాకుండా పుంగనూరు, పలమనేరు, సదుం, సోమల, ఉప్పరపల్లి ప్రాంతాలకు చెందిన పందెం కోళ్లు, నిర్వాహకులు, బెట్టింగ్ రాయుళ్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామంలోని పాఠశాల వద్ద పందేలు సాగాయి. స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సొంత మండలంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక నియోజకవర్గంలో ఎలా ఉంటుందోనని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది.
11 మంది జూదరుల అరెస్ట్
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో పేకాట ఆడుతున్న 11 మందిని టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సంతపేటలోని ఓ ఇంట్లో జూదం ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇన్చార్జ్ సీఐ మహేశ్వర ఆధ్వర్యంలో దాడులు చేసిన పోలీసులు 11 మందిని అరెస్టుచేసి, రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వాహకుడు శ్యామ్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడ్ని అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు.
మరో ఐదుగురి అరెస్ట్
పలమనేరు: కనకదుర్గ గోల్డ్లోన్ ఫైనాన్స్లో అందులో పనిచేసే సిబ్బంది చేసిన మోసం కేసులో పలమనేరు పోలీసులు గురువారం మరో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డీఎస్పీ డేరంగుల ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు బ్రాంచ్ల్లో సిబ్బందే నకిలీ బంగారాన్ని పెట్టి రూ.8 కోట్ల రుణాలు పొందిన మోసం కేసులో వందలాది మందిని విచారించామన్నారు. ఇందులో భాగంగా ముందు ఏడుగురిని అరెస్ట్ చేశామన్నారు. ఇదే కేసులో పలమనేరుకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో బొమ్మిదొడ్డి శంకరప్ప, బోసురెడ్డి, గణేష్, నరేష్కుమార్, భానుప్రకాష్ ఉన్నట్టు తెలిపారు.
వ్యభిచార గృహంపై దాడి
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని రామ్నగర్ కాలనీలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు బుధారం రాత్రి తనిఖీలు చేపట్టారు. రాంనగర్ కాలనీ బీ–క్రాస్ వీధిలో ఓ మహిళ అద్దె ఇంటిని తీసుకుని, వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆమెతో పాటు ఇద్దరు మహిళలు, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ మహేశ్వర తెలిపారు.