
జిల్లాలో దిగజారిన మామిడి ధర
● ర్యాంపుల్లో కేజీ రూ.3లే ● ఫ్యాక్టరీల వద్ద రైతుల పడిగాపులు ● టోకన్ల కోసం గుడిపాలలో తొక్కిసలాట ● సొమ్ముసిల్లిన రైతులు ● అడ్డగోలుగా దళారీ వ్యవస్థ ● పట్టనట్టు వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం
జిల్లాలో మామిడి ధర పతనమవుతోంది. తోతాపురి ధర దిగజారుతోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మూలనపడింది. ర్యాంపుల్లోనే కేజీ రూ.3కే అమ్ముడవుతోంది. దీనికితోడు దళారీ వ్యవస్థ అడ్డగోలుగా తయారైంది. తమిళనాడు కాయలను కొని.. ప్రభుత్వ ప్రోత్సాహక నిధి రూ.4 కోసం దందా సాగిస్తోంది. ఈ ప్రభావం జిల్లా రైతులపై పడుతోంది. ఫ్యాక్టరీల వద్ద రైతాంగం పడిగాపులు కాస్తోంది. టోకన్ల కోసం తొక్కిసలాట, తోపులాటలతో సొమ్మసిల్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
కాణిపాకం: జిల్లాలో తోతాపురి అవస్థలు తార స్థాయికి చేరాయి. అధిక దిగుబడిని సాకుగా చూపి అందినకాడికి దోచుకునేందుకు ర్యాంపులు తళుక్కుమంటున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 23కి పైగా ర్యాంపులు తెరపైకి వచ్చాయి. వీటిలో కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. మరికొన్నింటికి రిజిస్ట్రేషన్లు లేవని అధికారులే చెబుతున్నారు. కోతలు పెరిగే కొద్దీ ర్యాంపులు తొతాపురి కేజీ రూ.4 నుంచి రూ.3కు తగ్గిపోయింది. జిల్లా కేంద్రంలో అది కూడా కలెక్టరేట్కు కూత వేటు దూరంలో ఉన్న ఓ ర్యాంపులో కేజీ రూ.3కే కొనుగోలు చేస్తున్నారు. అలాగే చిత్తూరు రూరల్ మండలం, బంగారుపాళ్యం, పలమనేరు, పులిచెర్ల, జీడీనెల్లూరు, పెనుమూరు తదితర ప్రాంతాల్లోని ర్యాంపుల్లో కేజీ రూ.3కే ఫిక్స్ అయ్యారు. ర్యాంపుల్లో ఈ రకమైన దోపిడీ అధికమవుతున్నా సంబంధిత అధికారులుగానీ, కూటమి నేతలు గానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
దళారుల దోపిడీ ఇలా..!
మామిడి పంట విషయంలో తమిళనాడు రాష్ట్రం చేతులెత్తేసింది. ఈ కారణంగా అక్కడ మామిడి ధరలు పూర్తిగా క్షీణించాయి. ప్రస్తుతం అక్కడి రైతులు తోతాపురి కేజీ.3కి విక్రయిస్తున్నారు. అయితే ఈ ధరలు దళారులకు కలిసొస్తోంది. వీరు గ్యాంగ్గా ఏర్పడి ఫ్యాక్టరీ నిర్వాహకులతో కుమ్మకై తమిళనాడు కాయలను రూ.3కు కొనుగోలు చేసి జిల్లాలోని ఫ్యాక్టరీలకు తీసుకొచ్చేస్తున్నారు. తమిళనాడు కాయలను ఇక్కడ కేజీ రూ.4, రూ.5కు విక్రయించి దళారులు దండుకునేపనిలో పడ్డారు.
ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నిధి రూ4ను దోచుకోవడానికి కొత్తదారిని ఎంచుకున్నారు. దళారులకు మామిడి పంట లేకున్నా.. రూ.4 కోసం కొత్త దోపిడీని మొదలుపెట్టారు. ఏదో ఒక పట్టా పాసుపుస్తకాన్ని చూపిస్తున్నారు. ఇలా గుడిపాల, యాదమరి, బంగారుపాళ్యం, చిత్తూరు, జీడీ నెల్లూరు, పాలసముద్రం, ఎస్ఆర్పురం తదితర మండల సరిహద్దు ప్రాంతాల్లో దళారులు రాజ్యమేలుతున్నారు.
సమయం లేదు మిత్రమా
మేలో సంవృద్ధిగా వర్షాలు కురిశాయి. ఈ వర్షానికి మామిడి పంట పక్వానికి వచ్చింది. రెండు వారాల్లో కోతలు కోయకుంటే ..మామిడికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే తోటలోని కాయలు రాలిపోతున్నాయి. టోకన్లు జూలై నెలాఖరు వరకు ఇస్తే.. అంతవరకు చెట్లోని కాయలు ఏమైపోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.
టోకన్ల కోసం గుడిపాల మండలంలోని ఫుడ్ ఇనోసిస్ ఫ్యాక్టరీ ఎదుట గుమికూడిన రైతులు
ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు
రైతులకు గుజ్జు పరిశ్రమల వద్ద అవస్థలు తప్పడం లేదు. జీడీనెల్లూరు మండలం ఎట్టేరి సమీపంలోని ఫ్యాక్టరీ వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. టోకన్లు తీసుకున్న రైతులు మామిడి పంటను కోతలు కోసి విక్రయానికి తెచ్చుకున్నారు. వీరి రాకతో కిలో మీటరు మేర ట్రాక్టర్లు, లారీలు క్యూకట్టాయి. ఇలా రెండు, మూడు రోజులు కాయలు ట్రా క్టర్లలోనే ఉండిపోవడంతో కాయలు నల్లగా మారిపోతున్నాయి. గుడిపాల మండలంలోని ఫుడ్ ఇనోసిస్ ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి 20 ట్రాక్టర్లను ఎలాంటి అనుమతి లేకుండా ఫ్యాక్టరీ వాళ్లను బెదిరించి స్థానిక కూటమి నాయకులు బలవంతంగా ఫ్యాక్టరీకి అంటగట్టారని నిర్వాహకులు వాపోయారు. వారి వల్ల ఇక్కడున్న వందలాది వాహనాలు ఇబ్బంది పడాల్సి వచ్చిందని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మా బతుకులు దారుణం
మామిడి రైతుల బతుకులు దారుణంగా మారాయి. ఎప్పుడూ లేనంతగా రైతు ఈసారి అవస్థలు పడుతున్నాడు. మామిడి కాయలు అమ్ముకోవడానికి ఇలా క్యూలో పడి నలిగిపోతున్నాము. కేవలం టోకన్ల కోసమే ఈ పరిస్థితి ఉంటే.. వచ్చిన కాయలు అక్కడికక్కడికి అలానే నిలిచిపోయాయి. టోకన్లు జూలై నెలాఖరు వరకు ఇస్తున్నారు. అంత వరకు చెట్లల్లో కాయలు ఉంటాయా..? ప్రభుత్వమే ఆలోచించాలి. –జ్యోతీశ్వర్రెడ్డి, బంగారుపాళ్యం
తొక్కిసలాట.. తోపులాట
గుడిపాల మండలంలోని ఫుడ్ ఇనోసిస్ ఫ్యాక్టరీ వద్దకు రైతులు మంగళవారం టోకన్ల కోసం వేలా ది మంది తరలివచ్చారు. చిత్తూరు, గుడిపాల, బంగారుపాళ్యం, జీడీనెల్లూరు, యాదమరి, రాష్ట్ర సరిహద్దులోని తమిళనాడు రైతులు సైతం వేకువజామున 5 గంటలకే ఫ్యాక్టరీ ఎదుట భారీగా క్యూకట్టారు. వచ్చిన రైతులను కట్టడి చేయలేక ఫ్యాక్టరీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గుడిపాల పోలీసులు అదనంగా ఎస్టీఎఫ్ సిబ్బందిని రప్పించారు. ఒక్కసారిగా రైతులు ఫ్యాక్టరీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. టోకన్ల కోసం ముందు వరుసలో నిలవాలని పోటీ పడ్డారు. ఇలా మూడు గంటలపాటు అక్కడ గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో తో పులాట, తొక్కిసలాటలు జరిగాయి. ఓ వ్యక్తి తొ క్కిసలాటలో నలిగిపోయాడు. మరో వ్యక్తి సొమ్మ సిల్లి పడిపోయాడు. ఓ మహిళ కూడా గేటు తీసి టోకన్ల కోసం లోపలికి అనుమతించే క్రమంలో సొమ్మసిల్లింది. పోలీసులు తక్షణం స్పందించాల్సి వచ్చింది.

జిల్లాలో దిగజారిన మామిడి ధర

జిల్లాలో దిగజారిన మామిడి ధర

జిల్లాలో దిగజారిన మామిడి ధర

జిల్లాలో దిగజారిన మామిడి ధర

జిల్లాలో దిగజారిన మామిడి ధర