
భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో శనివారం సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. చతుర్థి సందర్భంగా ఉదయం ప్రధాన ఆలయంలోని అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు సుగంధ పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం ఆల య అధికారులు ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతర్థి గణపతి వ్రత్రాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. ఈవో పెంచలకిషోర్ పాల్గొన్నారు.
స్వర్ణరథంపై ఊరేగింపు
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి రాత్రి ఆలయ మాడవీధుల్లో స్వర్ణ రథం ఊరేగారు. తొలుత అలంకార మండపంలో ఉత్సవ విగ్రహాలకు వేద పండితులు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామి వారి స్వర్ణ రథంలో కొలువు దీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి స్వర్ణ రథం ఆలయ మాడవీధుల్లో దిగ్విజయంగా ఊరేగుతూ కనువిందు చేసింది. భక్తులు కర్పూర హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి