
ఏఐ వైద్యం.. ప్రమాదకరం!
జిల్లా సమాచారం జిల్లా ప్రభుత్వాస్పత్రి 01 ఏరియా ఆస్పత్రి 04 సీహెచ్సీలు 08 అర్బన్ హెల్త్ సెంటర్లు 15 పీహెచ్సీలు 50
● బంగారుపాళ్యంకు చెందిన ఓ గృహిణి ఇంట్లో పనులు చేస్తూ కాలుజారి పడింది. యూట్యూబ్లో చూసి సెల్ఫ్ మెడికేషన్ వాడడం మొదలు పెట్టింది. నాలుగు రోజుల తర్వాత కూడా నొప్పి తగ్గకపోగా.. కాలు వాపు మరింత పెరిగింది. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. నెల రోజుల పాటు చికిత్సనందించారు. బిల్లు కూడా అధిక మొత్తంలో వేశారు. గాయమైన మొదట్లోనే వైద్యుడ్ని సంప్రదించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానికులు సూచించారు.
● చిత్తూరు నగరంలోని రాజేంద్ర అనే వ్యక్తి గుండె నొప్పిగా ఉందని ఓ ప్రైవేటు డాక్టర్ను ఆశ్రయించాడు. ఆ డాక్టర్ (జూనియర్ డాక్టర్) క్షుణంగా పరిశీలించారు. ఇతర సమస్యలపైనా ఆరా తీశారు. తర్వాత ఆ నొప్పి ఆధారంగా.. ఏఐలో సర్చ్ చేశారు. వాటి ఆధారంగా కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి మాత్రలు ఇచ్చారు. గుండె నొప్పి తగ్గకపోగా కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చాయి.
● చిత్తూరు నగరానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి ఒళ్లు నొప్పులతో బాధపడుతూ మాత్రల కోసం గూగుల్ను ఆశ్రయించాడు. వాటిని వేసుకున్న తర్వాత కూడా నొప్పులు తగ్గకపోగా జ్వరం వచ్చింది. వారం రోజుల తర్వాత ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి సరైన చికిత్సనందిస్తే కాస్త కోలుకున్నాడు.
.. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. చాలా మంది తమ సమస్యలకు సంబంధించి గూ గుల్, యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు. అక్కడ సూచిస్తున్న మందులు వాడి ప్రాణాల మీద కు తెచ్చుకుంటున్నారు. ఇలా సొంత వైద్యం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇప్పుడు ఏ సూచన కావాలన్నా.. ఏ విషయం తెలుసుకోవాలన్నా.. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)నే ఫాలో అవుతున్నారు. ఆరోగ్య విషయంలో కూడా దాన్నే నమ్ముకోవడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. కొందరు చాట్జీపీటీలో ఏ రోగానికి ఏ మాత్రలు వాడలో వెతుకుతూ.. అధిక డోసులు కలిగిన మందులు వాడేస్తున్నారు. ఫలితంగా కొత్త రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. చివరికి రోగం ముదిరి ప్రాణాల మీదకి రాగానే ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. అలెర్జీ ఉన్న వారికి గూగూల్ చెప్పిన మందులు వాడడం వల్ల శరీరంలో తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఏర్పడి రోగం ముదురుతుంది. సెల్ఫ్ మెడికేషన్ కేసులకు జిల్లా నిలయంగా మారింది. ఈ తరహా వాడకం వల్ల రోగాలు ముదిరి చివరి దశలో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. తిరుపతి స్విమ్స్, రుయా, చిత్తూరు జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో నిత్యం ఉండే ఓపీ సేవల్లో సగానికి పైగా కేసులు ఇలాంటి తరహాలోనే ఉంటున్నాయి. ఇందులో ప్రధానంగా నడివయస్సు వారే అధికంగా ఉండడం గమనార్హం. అందులోనూ విద్యావంతులు కూడా ఉంటున్నారు.
సొంత వైద్యానికి ప్రాధాన్యం
చిన్నరోగానికే వైద్యుని వద్దకు వెళితే డబ్బులు ఖర్చు అవుతాయని చాలామంది భావిస్తున్నారు. అందుకే ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటర్నెట్, మెడికల్ దుకాణాలు, ఇరుగు పొరుగు వారి సలహాలతో కావాల్సిన మందులు కొని వాడుతున్నారు. నాలుగు రోజుల వరకు సమస్య తగ్గకుండా విషమిస్తే గానీ ఆస్పత్రికి వెళ్లడం లేదు. సీజనల్ వ్యాధుల విషయంలోనూ ఇదే తంతు. మలేరియా, డెంగీ లక్షణాలు ఉన్నా తేలిగ్గా తీసుకోవడం, రోగం ముదిరిన తర్వాత ఆస్పత్రిలో చేరుతున్నారు. వైద్య పరీక్షల్లో రోగం తీవ్రత తెలిసి బెంబేలెత్తిపోతున్నారు. గూగుల్, చాట్ జీపీటీల వాడకం వల్ల నిండు ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
జిల్లాలో విద్యావంతులతో పాటు డాక్టర్లు సైతం ఏఐ ముసుగులోనే
విచ్చలవిడిగా మందులు వాడి రోగాల పాలు
ఏఐ సూచనలు మాత్రమే..
ట్రీట్మెంట్ చేయదంటున్న వైద్యులు
ఆన్లైన్ వైద్యం మంచిది కాదు
జనం టెక్నాలజీ మీద పడిపోతున్నారు. ఏం కావాలన్నా ముబైల్ ఫోన్లో సర్చ్ చేసి చూస్తున్నారు. ముఖ్యంగా వైద్యం విషయంలో ఈ రకమైన ప్రయత్నాలు వద్దు. ఏఐ డయోగ్నోసిస్లో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేతప్ప వైద్యం చేయదు. డబ్బులు ఖర్చవుతాయని ఇలాంటి ట్రిక్స్ చేస్తే.. అనారోగ్య సమస్యలు తప్పవు. డాక్టరు సలహాతోనే మందులు వాడాలి. – అశోక్కుమార్, వైద్యనిపుణులు, చిత్తూరు

ఏఐ వైద్యం.. ప్రమాదకరం!