భారత ప్రభుత్వం.. తాజాగా బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం.. బీమా కంపెనీలలో 100% విదేశీ పెట్టుబడులను ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతించింది. అంటే.. విదేశీ సంస్థలు ఇకపై భారత బీమా రంగంలో పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరం లేకుండా సులభంగా ప్రవేశించగలవు. ఈ నిర్ణయం ద్వారా భారత బీమా రంగం అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించడానికి అవకాశాలు పెరుగుతాయి.
అయితే.. విదేశీ పెట్టుబడులు 1938 బీమా చట్టానికి లోబడి ఉండాలి. అంతే కాకుండా బీమా, సంబంధిత కార్యకలాపాలను చేపట్టడానికి కంపెనీలు తప్పనిసరిగా భారత బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (IRDAI) నుంచి లైసెన్సులు లేదా అనుమతులు పొందాలి. అంటే, విదేశీ పెట్టుబడులు వచ్చినా కూడా భారత ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుందన్నమాట.
ఆటోమేటిక్ రూట్ కింద LICలో విదేశీ పెట్టుబడి 20%కి పరిమితం చేశారు. LICలో విదేశీ పెట్టుబడి అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం, 1956 (31 ఆఫ్ 1956)లోని నిబంధనలకు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం, 1956 (31 ఆఫ్ 1956)లోని సెక్షన్ 43 నిబంధనల ప్రకారం LICకి వర్తించే ఇన్సూరెన్స్ చట్టం, 1938 (4 ఆఫ్ 1938)లోని ఇతర నిబంధనలకు లోబడి ఉంటుంది'' అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
మరో ముఖ్యమైన రూల్ ఏమిటంటే.. విదేశీ పెట్టుబడులు ఉన్న భారతీయ బీమా సంస్థల్లో, కనీసం ఒక కీలక పదవిలో ఉన్న వ్యక్తి (చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా సీఈఓ) భారత నివాసి పౌరుడై ఉండాలి. ఇది దేశీయ నియంత్రణ, బాధ్యతను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయం.
ఇక బీమా మధ్యవర్తుల (ఇంటర్మీడియరీస్) విషయంలో కూడా 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చారు. ఇందులో బ్రోకర్లు, రీ-ఇన్సూరెన్స్ బ్రోకర్లు, కన్సల్టెంట్లు, కార్పొరేట్ ఏజెంట్లు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు, సర్వేయర్లు, లాస్ అసెసర్లు, మేనేజింగ్ జనరల్ ఏజెంట్లు, ఇన్సూరెన్స్ రిపాజిటరీలు ఉంటారు.
ఇదీ చదవండి: ట్రంప్ లేటెస్ట్ పోస్ట్.. వచ్చేవారం నుంచి కొత్త సుంకాలు!


