ఫార్చ్యూన్‌ కొంపముంచిన గంగూలీ ‘గుండెపోటు’

Fortune halts cooking oil ads featuring Sourav Ganguly - Sakshi

ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ యాడ్ క్యాంపెయిన్‌కు గంగూలీ ‘పోటు’

సోషల్‌ మీడియాలో భారీ ట్రోలింగ్‌

అన్ని ప్లాట్‌ఫాంలలో యాడ్‌ నిలిపివేత

సాక్షి, ముంబై: ప్రస్తుత టెక్‌ యుగంలో సోషల్‌ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తమకు నచ్చని అంశంపైన మాత్రమే గాకుండా, కొన్నిసునిశితమైన అంశాలను కూడా నెటిజన్లు  పట్టేస్తారు. తాజాగా వినియోగదారులను బుట్టలో పడేసే వ్యాపార ప్రకటనలపై  కూడా స్పందించడమే కాదు ట్రోలింగ్‌తో ట్రెండ్‌ క్రియేట్‌ చేశారు. వ్యంగ్య బాణాలు,  మీమ్స్‌తో తన అభిప్రాయాలను వెల్లడించారు. జనవరి 3 న తేలికపాటి గుండెపోటుకు గురైన తరువాత  భారత  క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ ఎండార్స్‌ చేసిన ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ వంట నూనె ప్రకటనపై యూజర్లు భారీగా  ట్రోల్‌ చేశారు.

ఇది నిజంగా హెల్దీ అయిలేనా? అంటూ.. ఇప్పటికైనా తెలిసిందా  దాదా.. గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ.. గంగూలీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ యాడ్ క్యాంపెయిన్‌పై సోషల్ మీడియా యూజర్లు విమర్శలు గుప్పించారు. క్రీడాకారుడైన గంగూలీ రోజూ వ్యాయామం చేస్తారు. ఫిట్‌గా ఉంటారు...అయినా గుండెపోటుకు గురయ్యారు. గంగూలీ యాడ్‌లో చెప్పినట్టుగా ఆ ఆయిల్‌ నిజంగా ఆరోగ్యమేనా అని ఒకరు ప్రశ్నించారు. ఒత్తిడే ప్రధాన కారణం కావచ్చు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కూడా "దాదా త్వరగా కోలుకోవాలి. ఎపుడూ పరీక్షించిన, ప్రయత్నించిన ఉత్పత్తులను మాత్రమే ప్రోత్సహించాలి. జాగ్రత్తగా ఉండాలి.. గాడ్‌ బ్లెస్‌’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు:

దీంతో గంగూలీ నటించిన సదరు ప్రకటనను అన్ని ప్లాట్‌ఫాంనుంచి తొలగించడం గమనార్హం. ‘దాదా బోలే  వెల్‌కం టూ ది ఫార్టీస్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ వంట నూనె యాడ్‌ వస్తుంది. ఈ ప్రకటన ఏప్రిల్ 2020 నుండి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సమయం నుంచి వివిధ ఛానళ్ల సమయంలో ప్లే అవుతోంది. అంటే 40ల ఏళ్ల వయసులో కూడా తమ నూనె గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది అనేది ఈ ప్రకటన సారాంశం. అయితే  తాజాగా గంగూలీకి గుండెపోటు రావడం, గుండెలో  రెండు బ్లాక్‌ ఉన్నాయని తేలడంతో  నెటిజన్లు తమదైన శైలిలో  స్పందించారు. ఈ నూనె ప్రామాణికతపై  విమర్శలు గుప్పించారు.

అయితే ఈ వివాదాన్ని  పరిశీలిస్తున్నామని,  బ్రాండ్‌ క్రియేటివ్‌ ఫార్చ్యూన్  క్రియేటివ్‌ ఏజెన్సీ  ఓగిల్వి & మాథర్  ప్రతినిధి తెలిపారు. అటు కస్టమర్ల విశ్వాసాన్ని  తిరిగి పొందేందుకు  సంస్థ వేగిరమే తగిన చర్యలు చేపట్టాలని యాడ్‌ ఏజెన్సీ నిపుణులు  భావిస్తున్నారు. కాగా బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఛాతీ నొప్పితో( జనవరి 2 న) పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.. మూడు కరోనరీ ఆర్టరీ  బ్లాక్స్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. యాంజియోప్లాస్టీ  అనంతరం, గూలీ  ఆరోగ్యం నిలకడగానే ఉందని రేపు( బుధవారం) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top