Dakshin 5 A Restaurant: మర్యాదగా ఆర్డర్‌ చేస్తే.. డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు.. మన హైదరాబాద్‌లో

Dakshin5 A Hyderabad Restaurant Trending in Social Media With courtesy Discounts - Sakshi

ఒకటి కొంటే ఒకటి ఉచితం, పండగ ప్రత్యేక తగ్గింపు లాంటి ఆఫర్లు మనమిప్పటి వరకు చూశాం. కానీ బ్రాండ్‌ ప్రమోషన్‌తో పాటు సోషల్‌ అవైర్‌నెస్‌ పెంచేందుకు హైదరాబాద్‌కి చెందిన ఓ రెస్టారెంట్‌ ఇస్తున్న ఆఫర్‌ నెవ్వర్‌ బిఫోర్‌ నెవ్వర్‌ ఆఫ్టర్‌ అన్నట్టుగా ఉంది. దీంతో ఈ రెస్టారెంట్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.  

నగరంలోని ఐటీ కారిడార్‌లో ఉన్న ఖాజాగూడలో ఇటీవల దక్షిణ్‌ 5 పేరుతో ఓ రెస్టారెంట్‌ని ప్రారంభమైంది. దీని ఓనర్లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వెరైటీ డిస్కౌంట్లు ప్రకటించారు. చూడటానికి కొత్తగా ఉన్న ఈ డిస్కౌంట్లు అందిస్తున్న తీరు దాని వెనుక దాగున్న పరమార్థం తెలుసుకున్న వారు ఈ రెస్టారెంట్‌ ఓనర్లను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

పాజిటివ్‌ వైబ్స్‌
ఈ రెస్టారెంట్‌కి వచ్చిన కష్టమర్లు ఆర్డర్‌ చేసే సమయంలో ప్లీజ్‌, థాంక్యూ, హావ్‌ ఏ నైస్‌డే, గుడ్‌మార్నింగ్‌, గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌ వంటి పదాలు వాడుతూ ఆర్డర్‌ చేస్తే ప్రత్యేక డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఉదాహారణకి ఈ హోటల్‌కి వెళ్లి మెనూ కార్డు చూసి థాళీ ఆర్డర్‌ చేస్తే బిల్‌ రూ. 275 అవుతుంది. అదే థాళీ ప్లీజ్‌ అని ఆర్డర్‌ చేస్తే రూ.20 డిస్కౌంట్‌తో థాళీ రూ. 255కే లభిస్తుంది. అలా కాకుండా గుడ్‌ ఈవినింగ్‌ ఏ థాళీ ప్లీజ్‌ అని ఆర్డర్‌ చేస్తే మరో రూ.10 అదనపు డిస్కౌంట్‌తో థాళీ కేవలం రూ. 240కే వస్తుంది. ఇలా అన్ని పదార్థాలపై ఈ తరహా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఈ ఆఫర్‌ ఎందుకంటే
హోటల్స్‌, రెస్టారెంట్లలో మనకు సర్వ్‌ చేసే వ్యక్తులతో మర్యాదగా మెలగడం అనేది కామన్‌సెన్స్‌. కానీ క్రమంగా అది కనుమరుగైపోతుంది. చాలా సార్లు చేయని తప్పుకి సర్వర్ల పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటారు. కొన్ని సంరద్భాల్లో వారిని మనుషులుగా కూడా గౌరవించరు. ఈ పద్దతిలో మార్పు తెచ్చేందుకు ఈ కొత్త రకం డిస్కౌంట్లు అందిస్తున్నామని రెస్టారెంట్‌ నిర్వాహాకులు అంటున్నారు. అంతేకాదు ఈ డిస్కౌంట్ల వల్ల కస్టమర్లు సైతం త్వరగా ప్రశాంత వదనం అలవరుచుకుంటున్నారని, అప్రయత్నంగా వారి మోములో చిరునవ్వులు పూస్తున్నాయంటూ వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరో ఆఫర్‌
ఈ కుటుంబ సమేతంగా భోజనాలకు వచ్చే వారి కోసం ఎల్డర్‌ ది బెటర్‌ ఆఫర్‌ కూడా ఇక్కడ అందుబాటులో ఉందని కొందరు కస్టమర్లు అంటున్నారు. ఈ ఆఫర్‌ ప్రకారం ఫ్యామిలీ లేదా గ్రూపుగా ఈ రెస్టారెంట్‌ వెళ్లే వారిలో పెద్ద వయసు వారు ఉన్నట్టయితే వారి వయస్సుని బట్టి ప్రత్యేక డిస్కౌంట్‌ కూడా అందిస్తున్నారు.

ట్రెండింగ్‌లో
ఈ కొత్త రకం ఆఫర్ల వెనుక వ్యూహాం ఏదైనా సరే.. ఇటీవల రోజుల్లో ఏ రెస్టారెంట్‌కి దక్కని ప్రచారం దక్షిణ్‌ 5కి లభిస్తోంది. ఐటీ సెక్టార్‌లో ఉన్న రెస్టారెంట్‌ కావడంతో ఇక్కడికి వెళ్లిన వారు.. ఈ డిస్కౌంట్లకు సంబంధించిన వివరాలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అనతి కాలంలోనే ఇది జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది. ఎంతో ఖర్చు చేస్తే కూడా రాని బ్రాండ్‌ ఇమేజ్‌ సోషల్‌ అవేర్‌నెస్‌తో కూడిన వెరైటీ డిస్కౌంట్‌తో వచ్చింది.

చదవండి: 47 అంతస్తులతో ‘హైదరాబాద్‌ వన్‌’.. దేశంలోనే ఫస్ట్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top