గుండాల: ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థులను పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడమే కాక హాజరుశాతం పెరిగేలా పర్యవేక్షించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ఆళ్లపల్లి మండలంలోని పెద్ద వెంకటాపురం, ఆళ్లపల్లి ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులు తక్కువగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ పిల్లలను తప్పక బడికి పంపేలా తల్లిదండ్రలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే, ఉపాధ్యాయులు బోధనతో పాటు మధ్యాహ్న భోజనం అమలుపై దృష్టి సారించాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆ తర్వాత పెద్దవెంకటాపురం – ఆళ్లపల్లి మధ్య రోడ్డు, కుంగిపోయిన కల్వర్టును పరిశీలించిన ఆయన.. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులను సూచించారు. కొత్తగూడెం ఆర్డీఓ మధు, తహసీల్దార్ ఉషారాణి, ఎంఈఓ శాంతారావు తదితరులు పాల్గొన్నారు.
నీటిపారుదల ప్రాజెక్టులకు భూసేకరణ
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి కలెక్టరేట్లో మంగళవారం ఆయన పలు ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్షించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా భూమి సేకరించాలని తెలిపారు. సర్వేకు అదనపు సర్వేయర్లు అవసరమైతే ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్రనాథ్, డీఆర్ఓ పద్మావతి, కొత్తగూడెం ఆర్డీఓ మధు తదితరులు పాల్గొన్నారు.
కాలేజీల్లో మరమ్మతులు పూర్తి చేయాలి
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ.. 14 కాలేజీల్లో రూ.3.31 కోట్ల వ్యయంతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. వీటిని త్వరగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. అలాగే, ప్రవేశాలు, బోధన ఇతర అంశాలపై సమీక్షించారు. జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


