కలెక్టర్ అంకిత్
చర్ల: తాలిపేరు ప్రాజెక్ట్ ఎడమ కాల్వకు మరమ్మతులు చేపట్టాలని, నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. శుక్రవారం ఆయన దుమ్ముగూడెం మండలం వీరభద్రపురం గ్రామ పరిధిలోని ఎడమ కాల్వను పరిశీలించారు. నీటి ప్రవాహం, ఆయకట్టు వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు సాగు నీటి విడుదలలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఆయకట్టు పరిధిలోని ప్రతీ రైతుకు సాగునీరు అందేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. బాధితులతో మాట్లాడి వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు. రికార్డులు, మందులను పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సిబ్బందికి సూచించారు. తహసీల్దార్ అశోక్ కుమార్, ఇరిగేషన్ ఈఈ జానీ తదితరులు పాల్గొన్నారు.


