● చికిత్స పొందుతున్న బాలిక మృతి
ఖమ్మంఅర్బన్: ఖమ్మం కవిరాజనగర్లోని రోడ్డు నెంబర్–12కు చెందిన ధారవల్లి హర్షిత (16) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఇటీవల పదో తరగతి పూర్తిచేసిన ఆమె ఫోన్ చూస్తుండడంతో గత నెల 24వ తల్లి మందలించగా ఎలుకల మందు మింగింది. దీంతో కుటుంబీకులు ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. కాగా, పదో తరగతి పరీక్షలు వెలువడిన బుధవారమే హర్షిత మృతి చెందడం.. ఫలితాల్లో ఆమె 530మార్కులతో పాసైనట్లు తేలగా కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు ఖమ్మంఅర్బన్ పోలీసులు తెలిపారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
రఘునాధపాలెం: మండలంలోని వేపకుంటలో పలు వురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు గురువారం తనిఖీ చేపట్టారు. సీఐ ఉస్మాన్ షరీఫ్ ఆధ్వర్యాన చేపట్టిన తనిఖీల్లో నలుగురు పట్టుబడగా, మరో నలుగురు పరారయ్యారు.
కేసు కొట్టివేత
బూర్గంపాడు: 2021లో బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన కోట సాయిరాం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. ఆత్మహత్యకు అతని అత్తమామలు మోదుగు వెంకటేశ్వర్లు, అలివేలు వేధింపులే కారణమని ఆరోపిస్తూ బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కొత్తగూడెంలోని అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టులో విచారణ అనంతరం ఆరోపణలను నిరూపించే సరైన, విశ్వసనీయ సాక్ష్యాధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. దీంతో న్యాయమూర్తి కవిత బుధవారం కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.


