గాయపడిన వ్యక్తి మృతి
మణుగూరుటౌన్: మండలంలోని తిర్లాపురం గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మండకం మూకయ్య(50) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కుంట ప్రాంతానికి చెందిన మూకయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడగా భద్రాచలం, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మణుగూరు సీఐ ముత్యం రమేష్ తెలిపారు.
చెట్టుకు బైక్ ఢీకొని...
పాల్వంచరూరల్: ద్విచక్రవాహనం చెట్టుకు ఢీకొని గాయపడ్డ యువకుడు మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. బూర్గంపాడు మండలం పోలవరం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ సోయం వంశీ (19)సోమవారం మండల పరిధిలోని పాండురంగాపురం గ్రామం వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆటోలో పాల్వంచ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తీసుకెళ్లి వైద్యం చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళవారం హైదరాబాద్ తీసుకెళ్తుందడగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి సోయం గణేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
పూరి గుడిసె దగ్ధం
పాల్వంచరూరల్: మండల పరిధిలోని దంతెలబోర పంచాయతీ గంగదేవిగుప్ప గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఓ పూరి గుడిసె దగ్ధమైంది. గ్రామానికి చెందిన పాయం సుజాత ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. ఇంటితోపాటు దుస్తులు, బియ్యం, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. రూ.40 వేల ఆస్తి నష్టం జరిగింది. ఆర్ఐ హచ్చా సంఘటనా స్థలాన్ని సందర్శించి నష్టం అంచనా వేశారు.