బయోమెట్రిక్‌ అమలు చేయండి

సమాచార కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న
కలెక్టర్‌ అనుదీప్‌ తదితరులు   - Sakshi

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి, పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే నెల నుంచి బయోమెట్రిక్‌ ఆధారంగానే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గైర్హాజరైన కాలానికి వేతనం నిలిపేస్తామని అన్నారు. సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు వారం రోజుల్లో పరిహారం అందజేయాలని, ఈ మేరకు ఆర్డీఓలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కె. వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని..

●కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని కూలీ లైన్‌కు చెందిన దోమల కౌసల్య 5–2–65 నంబర్‌ గల ఇంట్లో 40 సంవత్సరాలుగా నివసిస్తున్నామని, మున్సిపాలిటీ నుంచి ఇంటిపన్ను రూ 33,631 వేశారని, దీనిపై విచారణ నిర్వహించి పన్ను లెక్కింపు చేయాలని దరఖాస్తు చేశారు. దీన్ని పరిశీలించాలని మున్సిపల్‌ కమిషనర్‌కు ఎండార్స్‌ చేశారు.

●భద్రాచలానికి చెందిన తిరుపతి మంజువాణి తన తండ్రి మేఘ వెంకటగురుమూర్తి పేరున సర్వే నం. 57/2అ లో ఉన్న రెండెకరాల భూమిని తన పేరున మార్చాలని దరఖాస్తు చేయగా తగు చర్యల కోసం ధరణి కోఆర్డినేటర్‌కు ఎండార్స్‌ చేశారు.

●దుమ్ముగూడెం మండలం కాశీనగర్‌ గ్రామానికి చెందిన నాగవెంకటశివ, సంతోష్‌ సర్వే నం. 20/1/అ/2లో ఉన్న భూమికి పాసుబుక్‌ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా తగు చర్యలు నిమిత్తం తహసీల్దార్‌కు సిఫార్సు చేశారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం మహోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో సోమవారం శ్రీరామనవమి, మహాపట్ట్టాభిషేకం కార్యక్రమాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన ఆడియోను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు సమాచారం కోసం కొత్తగూడెం బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, కిన్నెరసాని, భద్రాచలం, టోల్‌గేట్‌, మార్కెట్‌యార్డు, విస్తా కాంప్లెక్స్‌, దేవస్థానం ఏరియా, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, తాతగుడి సెంటర్‌, డిగ్రీ కళాశాల, ఆర్డీఓ కార్యాలయం, కూరగాయల మార్కెట్‌, చర్ల రోడ్‌, యూబీ రోడ్‌, ఐటీడీఏ రోడ్‌, జూనియర్‌ కళాశాల క్రీడా మైదానం, స్నానాలఘాట్‌, బీఈడీ కళాశాల, అంబేద్కర్‌ సెంటర్‌, ఎల్‌ఐసీ కార్యాలయం, తానీషా కల్యాణ మంటపం, సాధువుల మండపం, ఆర్టీసీ బస్టాండ్‌లలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. చిన్నపిల్లలు తప్పిపోతే ఆర్డీఓ కంట్రోల్‌ రూం, పర్యవేక్షణ అధికారులైన వెంకటరమణ(9441536060), వాల్యా(6301582152) నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీపీఆర్‌ఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమలపై అవగాహన కల్పించాలి

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు మంచి వనరులు ఉన్నాయని, ఆసక్తి ఉన్న యువతకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ అనుదీప్‌ పరిశ్రమల శాఖాధికారులను ఆదేశించారు. 2022 డిసెంబర్‌ 21 నుంచి 2023 మార్చి 25 వరకు పరిశ్రమల ఏర్పాటుకు 15 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రెండు దరఖాస్తులు తిరస్కరించా మని చెప్పారు. 8 యూనిట్ల ఏర్పాటుకు 15 దరఖాస్తులు వచ్చాయని, అనుమతులు మంజూరు చేసిన యూనిట్ల విలువ రూ.3 కోట్లు ఉంటుందని వివరించారు. టీఎస్‌పీ ద్వారా 29 మంది ఎస్టీలకు రూ 11.47 కోట్లు, ఇద్దరు ఎస్సీలకు రూ 8.30 లక్షల సబ్సిడీ మంజూరుకు ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపనున్నట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ జీఎం పవన్‌కుమార్‌, విద్యుత్‌ ఎస్‌ఈ రమేష్‌, ఎల్‌బీ ఎం రామిరెడ్డి, ఆర్టీఓ వేణు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సంజీవరావు, భూగర్భ జలశాఖ ఏడీ బాలు, ఐటీడీఏ ఎస్‌ఓ సురేష్‌, పరిశ్రమల శాఖ ఇన్‌స్పెక్టర్‌ నితిన్‌కుమార్‌, టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారి సత్యనారాయణ, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వ ర్లు, పరిశ్రమల విస్తరణాధికారి ఫృథ్వీ పాల్గొన్నారు.

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

ఒత్తిడికి గురి కావొద్దు

పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలని, కష్టం అనిపించిన సబ్జెక్టుల్లో సందేహాలను ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. పది విద్యార్థులకు ఉపయోగపడేలా రూపొందించిన కరపత్రాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ ఎస్‌. మాధవరావు, జిల్లా విద్యాశాఖ అకడమిక్‌ కోఆర్డినేటర్‌ ఎ. నాగరాజశేఖర్‌, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్‌ ఎస్‌కే సైదులు, సహాయ గణాంక అధికారి ఎన్‌ సతీష్‌కుమార్‌, ఏపీఓకే కిరణ్‌ పాల్గొన్నారు.

Read latest Bhadradri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top