చెరుకుపల్లి: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు వారు నివసించే ప్రదేశాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులతో కలసి పాల్గొన్నారు. ముందుగా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలసి ఎంపీడీవో కార్యాలయం నుంచి ఐలాండ్ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఙ చేయించారు. అదే సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ అధికారులతో కలసి ప్రారంభించారు. ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా పంచాయతీ అధికారి కె.ఎల్ ప్రభాకరరావు అధ్యక్షత వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. కార్యక్రమంలో రేపల్లె ఆర్డీవో బూసి శ్రీదేవి, మండల ప్రత్యేక అధికారి మాధవి, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు వైద్య ఆరోగ్య శాఖ, డ్వాక్రా, అంగన్వాడీ, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా సంయుక్త కలెక్టర్ భావనవశిష్ఠ


