ముస్లింల హృదయాల్లో నిలిచిన వైఎస్సార్
వక్ఫ్ ఆస్తులు దోచుకునే యత్నంలో టీడీపీ ప్రభుత్వం ఎన్నటికై నా మైనార్టీల పక్షపాతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే... వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా
పట్నంబజారు: ముస్లింల హృదయాల్లో నిలిచిన నేత వైఎస్సార్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా సీఎం చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లా ముస్లిం మైనార్టీ విభాగం నేతల సమావేశం జరిగింది. సమావేశానికి మైనార్టీ విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు పఠాన్ సైదా ఖాన్ అధ్యక్షత వహించారు. ముందుగా మోజన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పఠాన్ అబ్దుల్లా ఖాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం ఉమ్మద్ పోర్టల్కు సంబంధించి కేంద్రం గడువు పొడిగించాలని, వక్ఫ్ రిజిస్ట్రేషన్ సంబంధించి కేంద్రం అదనపు సమయం ఇవ్వాలని కోరుతూ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఖాదర్ బాషా మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అంటే మైనార్టీల పార్టీ అని నేరుగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చెప్పారని స్పష్టం చేశారు. మోజన్, ఇమామ్లకు సంబంధించి వైఎస్సార్సీపీ ఆందోళన చేపడితేనే గౌరవ వేతనాలు జారీ చేసిన పరిస్థితి ఉందన్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత వై.ఎస్.జగన్కు మాత్రమే దక్కుతుందన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం మైనార్టీలకు అండగా నిలిచి, వారి సంక్షేమం కోసం రూ. 23 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత వై.ఎస్.జగన్కు దక్కుతుందన్నారు.
ముస్లింలకు అండగా మహానేత
చరిత్రలో ముస్లిం మైనార్టీల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నిలిచిపోయారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కొనియాడారు. ముస్లింలకు తొలి నుంచి వైఎస్సార్ కుటుంబం అన్ని విధాలా అండగా ఉందన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబులు మైనార్టీల పేదరికాన్ని గుర్తించలేదని, వారి ఇబ్బందులు గుర్తించి సాయం చేసిన గొప్ప మనస్సు వైఎస్సార్దని కీర్తించారు. టీడీపీకి భయం పట్టుకుందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు భయపడరన్నారు. విజయవాడ సమీపంలో ఏర్పాటు చేస్తానన్న హజ్ హౌస్ ఏర్పాటు చేశారా.. అని ప్రశ్నించారు. రాజధాని రైతులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నారని తెలిపారు. 2014 అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం మైనార్టీ మంత్రి కూడా లేని కేబినెట్ నిర్వహించిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి రాష్ట్రాన్ని మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్థులను తన అనుచరులకు దోచి పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, మైనార్టీ విభాగం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు హఫీజ్ ఆరోపించారు. వైఎస్సార్సీపీ తొలి నుంచి మైనార్టీల పక్షపాతి పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా చెప్పారు. జగనన్న మైనార్టీల అభివృద్ధి దిశగా రాష్ట్రంలో తొలిసారి తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు గులాం రసూల్, హబీబుల్లా, పఠాన్ అబ్దుల్లా ఖాన్, పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు పి.ఎస్.ఖాన్, ఉమ్మడి జిల్లా మైనార్టీ విభాగం నేతలు ఇమామ్ హుస్సేన్, ఖాశీంబేగ్, అప్సర్, జానీబాషా, ఫెరోజ్ఖాన్, దుబాయిబాబు, గోల్డ్బాబు, మస్తాన్వలి, షర్ఫుద్దీన్, పలు అనుబంధ విభాగాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.


