మేదరమెట్ల: విద్యార్థులకు ప్రభుత్వం అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) జరిగింది. కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోని 452 మంది విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు. కలెక్టర్ వెంకట మురళి, తహసీల్దార్ సుబ్బారెడ్డి, ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, ఎంపీపీ సాధినేని ప్రసన్నకుమారి, మన్నె రామారావు, మేదరమెట్ల శ్రీనివాసరావు, మండల నాయకులు పాల్గొన్నారు.
పెరుగుతున్న సాగర్ నీటిమట్టం
విజయపురి సౌత్: నాగార్జునసాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రం ఆరు గంటలకు 541.20 అడుగులకు చేరింది. కాగా, ఇది 190.8366 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 4,204, ఎడమ కాలువకు 3,202, ఎస్ఎల్బీసీకి 1,500 క్యూసెక్కులు విడుదల అవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం 8,906 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1,16,833 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
కందులు కొనుగోలు చేయండి
నరసరావుపేట: కందుల ధరలు తగ్గుతున్న నేపథ్యంలో జిల్లా రైతుల నుంచి కొనుగోలు చేయాలని దాల్ మిల్లర్లను జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు కోరారు. గురువారం కలెక్టరేట్లో దాల్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. వినుకొండ, దాచేపల్లి మండలాల్లో రైతుల వద్ద ఉన్న కందులను మెరుగైన ధరకు కొనాలన్నారు. ఈ వారంలోగా ధరను మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా నిర్ణయించి కొనుగోళ్లు ప్రారంభించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా వ్యవసాయ అధికారి జె.జగ్గారావు, ఆర్డీవోలు కె.మధులత, రమణాకాంత్రెడ్డి, మురళీకృష్ణ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు బకాయిల చెల్లింపు పూర్తి
నరసరావుపేట: జిల్లాలో గురువారం ధాన్యం కొనుగోలు బకాయిల్లో రూ.6.29 కోట్లు చెల్లింపులు ప్రధాన కార్యాలయ నుంచి రైతుల అకౌంట్లకు జమ చేశామని, దీంతో మొత్తం బకాయిలు రూ.11.36 కోట్ల చెల్లింపులు పూర్తిచేసినట్లు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 2024–25 రబీ సీజన్లో 68 రైతుసేవా కేంద్రాల ఆధ్వర్యంలో 37 కొనుగోలు కేంద్రాల ద్వారా 550 మంది రైతుల నుంచి రూ.11.36 కోట్ల విలువైన 4,904 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. ఈ ఏడాది జూన్ 30 వరకు రూ.4.07 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. జూలై ఒకటో తేదీన మరో రూ. కోటి రైతుల అకౌంట్లకు వేశామన్నారు.
నాణ్యతతో కూడిన
విద్యుత్ సరఫరాకు చర్యలు
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
నరసరావుపేట: నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ డి.పుల్లారెడ్డి చెప్పారు. గురువారం ఆయన బరంపేట విద్యుత్ కార్యాలయంలో పల్నాడు జిల్లా సర్కిళ్లపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ పనులు, రెవెన్యూ కలెక్షన్లు పెంపుదల, పీఎం సూర్య ఘర్లపై సమీక్ష చేసి లక్ష్యాలు నిర్దేశించామన్నారు. వ్యవసాయ పంపు సెంట్ల కనెక్షన్ల కోసం సుమారు రెండు వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వచ్చే మూడు నెలల వ్యవధిలో ఆ సర్వీసులు అందజేయాలని అధికారులను ఆదేశించామన్నారు. లో ఓల్టేజ్, అధిక లోడులు ఉన్న ప్రాంతాల్లో బేస్మెంట్లు వేసి అధిక ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా విద్యుత్ శాఖ అధికారి పి.విజయకుమార్, ఈఈ సీహెచ్ రాంబొట్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ సదుపాయాలు సద్వినియోగం చేసుకోండి
ప్రభుత్వ సదుపాయాలు సద్వినియోగం చేసుకోండి