ఒకరు దుర్మరణం, మరొకరికి గాయాలు
అద్దంకి: ముందు వెళ్తున్న రెండు మోటారు బైక్లను ఆటో ఢీ కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి దుర్మణం చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని శింగరకొండ సమీపంలో అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిలో బుధవారం జరిగింది. అందిన సమాచారం మేరకు.. కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామానికి చెందిన వెంకట్రావు (35) అద్దంకిలోని భవానీ సెంటర్లో చేపలు దుకాణం నడుపుతుంటాడు. శింగరకొండ భవనాశి చెరువులో చేపలు పడుతున్నారని తెలిసి బెక్పై వెళ్లాడు.
అదే విధంగా మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన లక్ష్మీపతి కూడా మరో బైక్పై వెళ్లాడు. పరిచయస్తులైన వీరిద్దరూ అక్కడి నుంచి తిరిగి వస్తుండగా, శింగరకొండ సమీపంలో వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీ కొట్టింది. దాంతో వెంకట్రావు బైక్ మీద నుంచి కిందపడి తల పగలడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. లక్ష్మీ పతి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్వల్పగాయాలైన వ్యక్తిని 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.